జేసీబీలో చంద్రబాబు పర్యటన
Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తుతోంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ తీవ్రంగా పడింది.
బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైంది కృష్ణమ్మ. దాని తీవ్రత ఇంకా తగ్గట్లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.

భారీ వర్షాల వల్ల విజయవాడ దాదాపుగా నీట మునిగింది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రకాశం బ్యారేజీ తీరం, దిగువ లోతట్టు ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. వరదనీరు ప్రవహించడం వల్ల ఉండవల్లిలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమాన్ని సైతం అధికారులు ఖాళీ చేయించారు.
అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, జక్కంపూడి, యనమలకుదురు, పడమట, రామలింగేశ్వర్ నగర్, భవానీపురం, పీఎన్బీఎస్ పరిసరాల్లో వరదనీరు పోటెత్తింది. పలు ఇళ్లను ముంచెత్తింది. రోడ్లపై వరదనీరు ప్రవహిస్తోండటం వల్ల వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలకు చెందిన పవర్ బోట్స్లల్లో నగరం మొత్తం కలియతిరిగారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారాన్ని తీసుకున్నారు. వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లల్లో ఆహార సరఫరా కార్యక్రమాలనూ పర్యవేక్షించారు చంద్రబాబు.
తాజాగా చంద్రబాబు యనమలకుదురు, పడమట ప్రాంతాల్లో పర్యటించారు. రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీపురంలో ముంపు బాధితులను పరామర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు జేసీబీలో పర్యటించడం ఆకర్షించింది. ఆ సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన వెంట జేసీబీలో కనిపించారు.












Click it and Unblock the Notifications