TTD: తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామి వారికి వెండి పళ్లెంలో పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.

అక్కడినుంచి సీఎం చంద్రబాబు నాయుడు మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులకు స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు సీఎం చంద్రబాబు నాయుడు దంపతులను ఆశీర్వదించారు. టీటీడీ ఈఓ శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన సందర్బంగా తిరుమలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న సమయంలో తిరుపతిలోని అలిపిరి దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications