ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ - కేబినెట్ హోదా : ఢిల్లీ కేంద్రంగా..!!
ఏపీ ప్రభుత్వ ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఆయన ఈ నెల 30వ తేదీన సీఎస్ గా పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఏపీకి నూతన సీఎస్ గా శమీర్ శర్మ నియిమతులయ్యారు. దీంతో...సుదీర్ఘ కాలం ఏపీ ప్రభుత్వంలో పని చేసిన అనుభవం... ఆయన పైన సీఎం కు ఉన్న నమ్మకంతో మరింత కాలం ఆయన సేవలు వినియోగించుకొనేందుకు నిర్ణయించారు. అందులో భాగంగా.. న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దాస్ కు కేబినెట్ హోదాలో పదవి
కేబినెట్ మంత్రి హోదాలో న్యూఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా ఆదిత్యనాథ్ దాస్ పనిచేయనున్నారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. దాస్ కు ముందు సీఎస్ గా పని చేసిన నీలం సాహ్నికి సైతం ప్రభుత్వం పదవీ విరమణ తరువాత పదవులు కేటాయించింది. తొలుత ప్రభుత్వ సలహాదారుగా , ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించింది. ఇక, ఇప్పుడు దాస్ కు సైతం కీలక బాధ్యతలు అప్పగిస్తోంది. వైఎస్సార్ సీఎం గా ఉన్న సమయం నుంచి దాస్ నీటి పారుదల వ్యవహారాలను పరవ్యవేక్షించారు. జగన్ పైన సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల అభియోగాల్లోనూ దాస్ కేసులు ఎదుర్కొన్నారు.
ఇరిగేషన్ వ్యవహారాల పైనే ఫోకస్
ఇక, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వానికి..జగన్ వ్యక్తిగత ప్రతిష్టకు సవాల్ గా మారుతోంది. కేంద్రం అనేక కొర్రీలు పెడుతూ పునారావాస ప్యాకేజి..సవరించిన అంచనాల విషయంలోనూ తేల్చకుండా వ్యవహరిస్తోంది. దీంతో..పాటుగా తెలంగాణ రాష్ట్రంతో ఏర్పడుతున్న నీటి వివాదాలు.. తాజాగా కేంద్రం రెండు రివర్ బోర్డుల నోటిఫికేషన్లు జారీ చేయటంతో ఇరిగేషన్ పైన పూర్తి పట్టు ఉన్న అధికారిగా దాస్ సేవలు ఢిల్లీలో వినియోగించుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో దాదాపుగా దాస్ తొలి నుంచి పర్యవేక్షిస్తున్నారు.
సీఎం జగన్ కు నమ్మకస్తుడిగా
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాస్ ను ఇరిగేషన్ నుంచి తప్పించి విద్యా శాఖ అప్పగించారు. ఆ సమయంలో శశిభూషణ్ కుమార్ ఇరిగేషన్ పర్యవేక్షించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాస్ కే తిరిగి ఇరిగేషన్ బాధ్యతలు అప్పగించారు. ఆయన సీఎస్ అయిన తరువాత కూడా ఇరిగేషన్ బాధ్యతల పైన ఎక్కువగా ఫోకస్ పెడుతూ కనిపించారు. దీంతో..ఇప్పుడు ఏపీకి పోలవరం తో పాటుగా ఇతర ప్రాజెక్టులు కీలకంగా మారటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
పోలవురం వ్యవహారాల్లో ప్రధాన భూమిక
సీఎస్ గా పని చేస్తున్న దాస్ కు ఏపీ ప్రభుత్వం మూడు నెలల పాటు పదవీ కాలం పొడిగించాలని కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం సైతం అంగీకరించటంతో ఈ నెలాఖరు వరకు దాస్ పదవిలో కొనసాగనున్నారు. ఆ తరువాత ఆయన ఏపీ భవన్ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహా దారు పదవిలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ కర్తగా నీటి పారుదల అంశాల్లో కీలకంగా వ్యవహరించనున్నారు.