ముఖ్య నేతలకు చెక్ : ఇక ఎమ్మెల్యేల వంతు - సీఎం జగన్ హిట్ లిస్టులో ఉన్నదెవరు..!!
ముఖ్యమంత్రి జగన్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించారు. ఎన్నికలకు తన టీం సిద్దం చేసుకుంటున్నారు. అందులో భాగంగా పని తీరే ప్రామణికంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీనియర్లు..తనకు దగ్గరి వారైనా నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నారు. పని చేయని వారిని..చేయలేని వారిని పక్కన పెట్టేసారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు.. జిల్లాల అధ్యక్షలు విషయంలో మార్పులు చేసిన సీఎం జగన్..ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే విషయంలో ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ పెంచుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరు ఆధారంగా జాబితా ముఖ్యమంత్రి వద్ద సిద్దంగా ఉంది.

ముఖ్యమంత్రి జగన్ సీరియస్ నిర్ణయాలు
ముఖ్యమంత్రి జగన్ పార్టీలో కీలక నేతల బాధ్యతల్లోనూ మార్పులు చేసారు. తొలి విడత కేబినెట్ లో మంత్రులుగా పని చేస పదవులు పోగొట్టుకున్న వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కేటాయించారు. ఇప్పుడు వారిలోనూ కొందరిని తప్పించారు. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే సజ్జల..మాజీ మంత్రులు కొడాలి నాని.. అనిల్ కుమార్ యాదవ్..బుగ్గన వంటి వారి విషయాల్లోనూ మినహాయింపులు ఇవ్వలేదు. దీంతో, వచ్చే ఎన్నికల విషయంలో కీలకమైన ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు విషయంలో తానెంతో కఠినంగా వ్యవహరించేదీ సీఎం ఈ నిర్ణయాల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. గతంలో జరిగిన గడప గడపకు ప్రభుత్వం వర్క్ షాపులో ముందుగానే హెచ్చరికలు చేసి ప్రాంతీయ సమన్వయకర్తలను సీఎం మార్పు చేసారు. అదే సమయంలో 27 మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ హెచ్చరికలు చేసారు.

పార్టీ ఫస్ట్..లీడర్ నెక్స్ట్ అనే విధంగా
తాను ఏ ఒక్క ఎమ్మెల్యేను వదులుకోవటానికి సిద్దంగా లేనని చెప్పారు. అదే సమయంలో పని తీరులో..ప్రజలతో మమేకం అయ్యే విషయంలో వెనుకబడిన వారికి డెడ్ లైన్ ఫిక్స్ చేసారు. వారి పనితీరు మెరుగు పడకుంటే పార్టీ కోసం అభ్యర్ధులను మార్చక తప్పదని స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు ఆ 27 మందిలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి గడప గడపకు ప్రభుత్వం లో ప్రతీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి జగన్ మూడు సంస్థల ద్వారా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. వారి నుంచి సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారు. గతంలో సీఎం హెచ్చరించిన వారిలో 27మందిలో మంత్రులు కూడా ఉన్నారు. మంత్రులు రోజా, తానేటి వనిత, కారుమూరు నాగేశ్వరరావు, బుగ్గన ఆ జాబితాలో ఉన్నారు. ఆ తరువాత వీరు నియోజకవర్గంలో పర్యటనలకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ
ఇక, సీనియర్ నేతలు మాజీ మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాస రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కోరుమట్ల శ్రీవివాసులు, శిల్పా చక్రపాణి రెడ్డి, గ్రంధి శ్రీనివాస్ వంటి వారు కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించని లిస్టులో ఉన్నారు. అదే సమయంలో గడపగపడకు ప్రభుత్వంలో పాల్గొంటూ ఈ లిస్టులో లేకపోయినా..ఆరోపణలు - ప్రజలకు దూరంగా ఉన్న వారి విషయంలోనూ మార్పులు తప్పవని చెబుతున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులను ప్రకటిస్తానని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేసారు. వచ్చ నెల తొలి వారంలో మరోసారి సీఎం జగన్ పార్టీ నేతలతో వర్క్ షాపు ఏర్పాటు చేసారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వై నాట్ 175 అంటూ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న సీఎం జగన్.. కీలకమైన ఎమ్మెల్యేల ఎంపిక విషయంలో గెలుపే లక్ష్యంగా తీసుకొనే నిర్ణయాలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications