మొన్న జ్యోతిర్మయి..నేడు అభిమన్యు: ఇంగ్లీషులో అదరగొడుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న వసతి దీవెన పథకం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆరో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి పేరు అభిమన్యు. ఇంగ్లీషులో మాట్లాడిన అభిమన్యు జగన్ సర్కార్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ప్రస్తావించాడు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలపై కుర్రాడు అభిమన్యు మాట్లాడారు. విద్యారంగంలో పెను మార్పులను తీసుకొచ్చిన వైయస్ జగన్ భగవంతుడితో సమానమని అన్నాడు. పేద ప్రజల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని కొనియాడిన అభిమన్యు... విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి చదువే ఆస్తి అని చెప్పిన సీఎం జగన్కు ప్రతి విద్యార్థి తరపున తల్లిదండ్రుల తరపున ధన్యవాదాలు చెప్పాడు.
పాదయాత్ర సమయంలో అధికారంలోకి వస్తే ప్రతి హామీని నెరవేరుస్తామని మాట ఇచ్చిన జగన్... అన్నిటినీ నెరవేరుస్తున్నారని అభిమన్యు చెప్పడంతో వేదికపై ఉన్న మంత్రులు చప్పట్లు కొట్టారు. అర్హులైన ప్రతి తల్లికి అమ్మఒడి పథకం ద్వారా రూ.15వేలు ఇస్తున్నారని అదే సమయంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సందర్భంగా గోరుముద్ద పథకం తీసుకువచ్చారని అభిమన్యు చెప్పాడు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టి తామంతా చక్కగా ఇంగ్లీషులో మాట్లాడగలిగేలా చేశారని అభిమన్యు చెప్పాడు. సీఎం జగన్ విద్యార్థుల ఉన్నతి కోసం ఎంతో కృషి చేశారని... ఆయన కన్న కలలను సాకారం చేస్తామని హామీ ఇస్తున్నట్లు అభిమన్యు చెప్పాడు. తాను బాగా చదివి ఐఏఎస్ అవుతానని చెప్పడంతో సభ చప్పట్లతో మారుమోగి పోయింది.
విద్యార్థులకు మంచి జీవితాన్ని ప్రసాదించిన సీఎం జగన్ తమకు భగవంతుడితో సమానం అన్నాడు అభిమన్యు. తన మొత్తం ప్రసంగాన్ని ఇంగ్లీషులో చెప్పడంతో సీఎం జగన్ మురిసిపోయారు. పిల్లాడిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టి ఆశీర్వదించారు. కొద్దిరోజుల క్రితం జగన్ కర్నూలు పర్యటనకు వెళ్లిన సందర్భంలో కూడా ప్రభుత్వ పాఠశాలకు చెందిన జ్యోతిర్మయి అనే విద్యార్థి ఇంగ్లీషులో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది.