ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి - సీఎం జగన్...!!
ముఖ్యమంత్రి జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై సీఎం జగన్ సమీక్ష నిర్వించారు. చదువులు కొనలేని కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారని..వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని నిర్దేశించారు. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి ఆమోదం తెలిపారు. డిసెంబర్1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్ను అంగన్వాడీల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, పైలెట్ ప్రాజెక్టు కింద ముందుగా కొన్ని అంగన్వాడీల్లో అమలు చేస్తామని అధికారులు సీఎం వైయస్ జగన్కు వివరించారు. అంగన్వాడీలలో టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. హాస్టళ్లలో ఉంచాల్సిన బంకర్ బెడ్స్... తదితర సౌకర్యాలన్నీ కూడా నాణ్యతతో ఉండాలని స్పష్టం చేసారు.
భవనాలను పరిగణలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలు- హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3013 చోట్ల నాడు-నేడు పనులు చేపట్టాలని సమీక్షలో నిర్ణయించారు. మొదటి ఫేజ్లో మొత్తం సుమారు 1366 చోట్ల నాడు - నేడు పనులు చేపట్టనున్నారు. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ కూడా మొదట విడతలోనే బాగుచేయాలని సీఎం ఆదేశించారు. హాస్టళ్లలో నాడు - నేడు కోసం సుమారు రూ.3364కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనాలు సిద్దం చేసారు.
ఇందులో తొలివిడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఏడాదిలోగా ఆ పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిచేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలని సీఎం స్పష్టం చేసారు. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యతతో అందించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలన్న అధికారులను ఆదేశించారు.