నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధి రెడీ - సీఎం జగన్ పర్యటన వేళ..!!
ముఖ్యమంత్రి జగన్ నర్సాపురం పర్యటన ఆసక్తి కరంగా మారుతంది. సోమవారం సీఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి సీఎం జగన్ నర్సాపురం నియోజకవర్గానికి వస్తున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభ లోనూ సీఎం పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది.
సీఎం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా నర్సాపురం
నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీలో గ్రూపులు -వర్గాలు పార్టీకి సమస్యగా మారుతున్నాయి. ఎమ్మెల్యే ప్రసాద రాజుకు వ్యతిరేకంగా వ్యవహరించిన సీనియర్ నేత కొత్తసుబ్బారాయుడిని పార్టీ నుంచి సీఎం జగన్ సస్పెండ్ చేసారు. అదే విధంగా నర్సాపురం ఎంపీ రఘురామ రాజు చాలా కాలంగా ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఆయన పైన ఏపీ సీఐడి కేసులు నమోదు చేసింది. రఘురామ ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటూ..నిత్యం మీడియా ద్వారా ప్రభుత్వ నిర్ణయాల పైన విమర్శలు కొనసాగిస్తున్నారు. ఆయన పైన అనర్హత వేటు వేయాలని వైసీపీ చేసిన ఫిర్యాదు స్పీకర్ పరిశీలనలో ఉంది. తన పైన అనర్హత వేటు సాధ్యం కాదని రఘురామ ధీమాగా ఉన్నారు.
ఎంపీ అభ్యర్ధి పైన ఇప్పటికే కసరత్తు
ఇక, ప్రధాని పర్యటన సమయంలోనూ స్థానిక ఎంపీ అయినా, రఘురామ హాజరు కాలేకపోయారు. ఇక, వచ్చే ఎన్నికలకు వరుసగా నియోజకవర్గాల సమీక్షల్లో సీఎం జగన్ అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామ ఈ సారి టీడీపీ- జనసేన లేదా బీజేపీ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ -జనసేన పొత్తు ఆధారంగా రఘురామ అభ్యర్దిత్వం ఏ నియోజకవర్గం నుంచి అనేది ఖరారు కానుంది. ఇటు వైసీపీ ఇప్పటికే నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దించాలనే అంశం పైన ఒక స్పష్టతతో ఉన్నట్లుగా తెలుస్తోంది. నర్సాపురం నియోజకవర్గంలో కాపు, క్షత్రియ సామాజికవర్గ ఓటర్లే అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్దేశించి పరిస్థితి ఉంది.
సీఎం జగన్ క్లారిటీ ఇస్తారా
దీంతో, ఎంపీ గోకరాజు గంగరాజును గానీ ఆయన కుటుంబంలోని వారిని గాని వైసీపీ రంగంలోకి దింపుతుందని భావిస్తూ వచ్చారు. అయితే మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంవీజీకే భానును బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, అనూహ్యంగా మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజును వైసీపీ నుంచి బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
దీనికి సంబంధించి పార్టీ నేతలు గోప్యత పాటిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ - జనసేన పొత్తు ఖాయమైతే గట్టి పోటీ నెలకొనటం ఖాయం. వచ్చే ఎన్నికల్లో తిరిగి నర్సాపురం లోక్ సభ స్థానం గెలుచుకోవం సీఎం జగన్ కు వ్యక్తిగతంగా ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. సీఎం జగన్ పర్యటన సమయంలోనే నర్సాపురం రాజకీయం పైన క్లారిటీ ఇస్తారని చెబుతుండటంతో, ముఖ్యమంత్రి ఏం చెబుతారనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.