విశాఖకు కాపురం మారుస్తున్నా - ముహూర్తం ప్రకటించిన సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసారు. అందరికీ ఆమోద యోగ్యమైన పరిపాలనా రాజధాని విశాఖ అని ప్రకటించారు. తాను ఇక నుంచి విశాఖ కేంద్రంగా కాపురం మారుస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి ముహూర్తం ఖరారు చేసారు. తోడేళ్లు అన్నీ కలిసి తన పైన చీకటి యుద్దం చేస్తున్నాయని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తాను వీరికి భయపడనని, తన ధైర్యం..నమ్మకం..ఆత్మవిశ్వాసం మీరేనంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన పాలనలో మంచి జరిగిందని భావిస్తే మీరే సైనికులుగా నిలవండంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఇక విశాఖలోనే కాపురం...
ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలన పైన స్పష్టమైన ప్రకటన చేసారు. అందరికీ ఆమోద యోగ్యమైన పరిపాలనా రాజధాని విశాఖ అని చెప్పిన సీఎం జగన్..సెప్టెంబర్ నుంచి తాను కాపురం అక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా విశాఖ నుంచి పాలన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మూడు రాజధానుల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. జూలై 11న సుప్రీంకోర్టు మూడు రాజధానుల కేసు విచారణ చేయనుంది.

అయితే, మూడు రాజధానుల పైన పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలించే అవకాశం ఉండటంతో, విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో భాగంగా సెప్టెంబర్ నుంచి ఇక విశాఖ నుంచి పాలనకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కీలక ప్రకటన చేసారు.
భయపడను..నా ధైర్యం ఒక్కటే
ప్రతిపక్షాలపైన సీఎం జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. ఏ రోజు ఒక్క మంచి కూడా చేయని వారు తనకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారని జగన్ పేర్కొన్నారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఎటువంటి మీడియా మద్దతు లేదని చెప్పారు.పెత్తం దార్ల పక్షాల నిలబడిన టీడీపీ, పేద ప్రజల పక్షాన నిలబడిన తనకు మధ్య యుద్దం జరుగుతుందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసే వారికి.. ప్రజలనే నమ్ముకున్న వారి మధ్య యుద్దం జరుగుతోందని వ్యాఖ్యానించారు.
తనకు మీడియా, దత్తపుత్రుడు మద్దతు లేదన్నారు. తన ధైర్యం..నమ్మకం..ఆత్మవిశ్వాసం ప్రజలేనని జగన్ చెప్పుకొచ్చారు. దేవుడి దయ..మీ ఆశీస్సును నమ్ముకున్నానన్నారు. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నా తనకు భయం లేదన్నారు. వాళ్లు ప్రచరారం చేస్తున్న అబ్దాలను నమ్మవద్దని కోరారు. మంచి జరిగిందా లేదా అనేదే కొలమానంగా తీసుకోవాలని..మంచి జరిగితే మీరే సైనికులుగా నిలబడాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.

భోగాపురం..డేటా సెంటర్ కు శంకుస్థాపన
మే 3వ తేదీన భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. అదే రోజున విశాఖలో డేటా సెంటర్ కు శంకుస్థాపన జరుగుతుందని వెల్లడించారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేసారు. అదే విధంగా నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి, దీంతో పాటుగా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేసారు.
అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు సన్మాన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఇక టెక్కలి అభ్యర్దిగా దువ్వాడ శ్రీనును ముఖ్యమంత్రి ప్రకటించారు.












Click it and Unblock the Notifications