నాలో... నాతో... వైఎస్సార్!.. భర్తపై పుస్తకం రాసిన వైఎస్ విజయమ్మ.. సీఎం జగన్ చేతులమీదుగా..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను ఆయన భార్య వైఎస్ విజయమ్మ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ''నాలో.. నాతో.. వైఎస్సార్'' శీర్షికతో రూపొందిన ఈ బయోగ్రఫీని వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ తోపాటు వైఎస్ కుటుంబీకులు, వైసీపీ ముఖ్యనేతలు ఇప్పటికే కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు.
వైఎస్సార్ తో పెళ్లయిన సందర్భం నుంచి తమ వైవాహిక జీవితం, పేదల కోసం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వైద్యం చేయడం, రాజకీయ రంగప్రవేశం, తమ పిల్లలు, దేవుడి పట్ల వైఎస్సార్ భక్తి, మరణానంతరం ఎదురైన సమస్యలు, సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు జరిగిన వివిధ ఘట్టాలను విజయమ్మ తన పుస్తకంలో పొందుపర్చారు.

ఒక తండ్రిగా, భర్తగా తనకు తెలిసిన వైఎస్సార్ ను ఆవిష్కరించడంతోపాటు ప్రజల నుంచి ఆయన ఏం నేర్చుకున్నారనే సమాచారాన్ని కూడా ''నాలో.. నాతో.. వైఎస్సార్''లో రాసినట్లు వైఎస్ విజయమ్మ ముందుమాటలో పేర్కొన్నారు. వివరించారు. మహానేతను ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
రాబోయే తరాలు కూడా వైఎస్సార్ గురించి తెలుసుకుని, స్ఫూర్తి పొందుతారన్న ఉద్దేశంతోనే ''నాలో.. నాతో... వైఎస్సార్'' రచనను చేపట్టానని వైఎస్ విజయమ్మ తెలిపారు. వైఎస్సార్ జయంతి అయిన జులై 8న సీఎం జగన్ చేతుల మీదుగా విడుదలకానున్న ఈ పుస్తకాన్నిఎమ్మెస్కో పబ్లికేషన్స్ ముద్రించింది. బుధవారం నుంచి అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో ఇది లభ్యమవుతుందని ప్రచురణకర్తలు తెలిపారు.












Click it and Unblock the Notifications