టీటీడీ ఛైర్మన్..ఈవోలుగా వారికే అవకాశం: రమణ దీక్షితులకు పోస్టింగ్: జగన్ కసరత్తు..!
ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..కొత్త ఈవో నియామకం పైన దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన బోర్డులో ఎవరికి అవకాశం ఇవ్వాలో డిసైడ్ అయ్యారు. ఇక, ప్రస్తుతం ఉన్న ఈవో..ఏడేళ్లుగా అక్కడే పాతుకుపోయిన జేఈవోను సైతం మార్చాలని నిర్ణయించారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఇక, శ్రీవారి మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులకు సైతం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీ తరువాత టీటీడీకి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ కానున్నాయి.
టీటీడీ ప్రక్షాళన దిశగా..
ప్రస్తుతం కొనసాగుతున్న టీటీడీ బోర్డు చంద్రబాబు హాయాంలో నియామకం జరిగింది. బోర్డు ఛైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ కొనసాగుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కొందరు సభ్యులు రాజీనామా చేసినా..ఛైర్మన్ మాత్రం రాజీనామా చేయలేదు. దీని పైనా ఆయన వివరణ ఇచ్చారు. వారం రోజుల క్రితం జరిగిన బోర్డు సమావేశం అనంతరం రాజీనామా చేయాలని భావించినా..ఆ సమావేశంలో అధికారుల ఓవర్ యాక్షన్ కారణంగా తాను రాజీనామా చేయలేదని..పదవ వదులుకోవాలంటే సెంటిమెంట్ అడ్డు వస్తుందంటున్న సుధకర్ యాదవ్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేసారు. అదే విధంగా తిరుమల కొండ పైన ఉన్న సమస్యల గురించి జగన్ ఇప్పటికే ఆరా తీసారు. ప్రముఖలకు ప్రాధాన్యత ఇచ్చి..సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారనే విషయం పైన చర్చించారు. వీటికి పరిష్కార దిశగా కసరత్తు చేస్తున్నారు.

కొత్త ఛైర్మన్..ఈవో..జేఈవో..
టీటీడీకి నూతన ఛైర్మన్గా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దాని పైన జగన్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఇద్దరి పేర్లను పరిగణ లోకి తీసుకున్నారు. మాజీ ఎంపి వైవీ సుబ్బారెడ్డి, కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేకపాటి అమర్నాధరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో సుబ్బారెడ్డికే ఎక్కువ శాతం చాన్స్ కనిపిస్తోంది. అదే విధంగా ప్రస్తుత ఈవో పని తీరు మీద సానుకూల నివేదికలు లేకపోవటంతో..కొత్త ఈవోను నియమించాలని నిర్ణయించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పని చేసిన గోపాలకృష్ణ ద్వివేదీని తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా నియమిస్తారని విశ్వసనీయ సమాచారం. ఇక, 2011 నుండి తిరుమలలో జేఈవోగా పాతుకుపోయిన శ్రీనివాస రాజును సైతం బదిలీ చేయనున్నారు. ఇక, తిరుమలలో వ్యవహారాలు..నిర్ణయాలు..పరిస్థితుల పైన పూర్తి అవగాహన ఉన్న శ్రీవారి ప్రధాన అర్చకులుగా పని చేసిన రమణ దీక్షితులకు సైతం కీలక పదవి ఇవ్వనున్నారు. నూతన బోర్డు నియామకం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జరగనుంది.












Click it and Unblock the Notifications