ప్రధానితో సీఎం జగన్ భేటీ - సస్పెన్స్ కు తెర: ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు..!?
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్ 28న ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ సిద్దం అవుతున్న వేళ ఈ పర్యటన కీలకం కానుంది. పాలనా పరమైన వ్యవహారాలతో పాటుగా రాజకీయంగానూ ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. విశాఖ కేంద్రంగా ప్రధాని మోదీ జనసేనానితో భేటీ తరువాత పొత్తుల వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పుడు టీడీపీ అధినేత బీజేపీతో పొత్తు కోసం వయా తెలంగాణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో.. నేరుగా ప్రధానితో ఏపీ రాజకీయాలపైన క్లారిటీ తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ప్రధానితో భేటీ తరువాత ఏపీ కేంద్రంగా రాజకీయాలు కీలక మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

పాలనా - రాజకీయ వ్యవహారాలే అజెండాగా
ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. జీ20 సమావేశాల పైన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్ - చంద్రబాబు పాల్గొన్నారు. ఆ తరువాత ఇప్పుడు మరోసారి సీఎం జగన్ ప్రధానితో భేటీ కావటం కీలకంగా మారుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలనా పరంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలను సీఎం జగన్ ప్రధాని వద్ద చర్చించి ఆమోదం తీసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలు సార్లు నివేదించిన పోలవరం సవరించిన అంచనాలు ప్రధాన అజెండాగా ఉంది. ముందస్తు నిధుల కేటాయింపులో భాగంగా ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే విధంగా సీఎం చర్చించనున్నారు. దీంతో పాటుగా ఏపీలో మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన ప్రధానితో చేయించాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు.. అమలు చేయాల్సిన హామీలపైనా చర్చించనున్నారు. జీ20 సన్నాహక సదస్సులు ఏపీలో నిర్వహణపైనా చర్చించే అవకాశం ఉంది

ఏపీలో పొత్తుల వ్యవహారం - ప్రధాని మూడ్ ఏంటి
ఏపీలో బీజేపీ కేంద్రంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల పొత్తు వ్యవహారం కొనసాగుతోంది. ప్రధానితో జనసేన అధినేత పవన్ విశాఖ లో భేటీ తరువాత టీడీపీతో సంబంధాలపైన ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీతో కాదనలేక..టీడీపీతో దూరం కాలేక పవన్ తర్జన భర్జన పడుతున్నారు. అటు చంద్రబాబు 2014 పొత్తులు ఏపీలో రిపీట్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ నుంచి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. బీజేపీతే పొత్తు కోసమే తిరిగి తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, బీజేపీ నేతలు తమకు జనసేనతో మాత్రమే పొత్తు అని స్పష్టం చేస్తున్నారు. ప్రధానితో సీఎం సమావేశంలో ఏపీలో తాజా రాజకీయాల పైన చర్చకు రావటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో రాజకీయాల పైన చర్చకు వచ్చే అకాశం ఉంది. ఏపీలో పొత్తుల వ్యవహారం పైన ప్రధాని మూడ్ ఏంటనేది స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా జగన్ వచ్చే ఎన్నికలకు తన ప్రణాళిలను అమలు చేయనున్నారు. దీంతో, ఈ మీటింగ్ ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది.

ద్విముఖ వ్యూహంతో ఎన్నికల బరిలోకి సీఎం జగన్
రానున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సీఎం జగన్ కసరత్తు ముమ్మరం చేసారు. బీజేపీతో టీడీపీ - జనసేన పొత్తు ఉంటుందా లేదా అనే అంశం ఆధారంగా తన వ్యూహాలకు పదును పెట్టే అవకాశం ఉంది. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు కార్యాచరణ అమలు చేస్తోంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధానితో భేటీ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ భేటీలో అన్ని అంశాలను ఓపెన్ గా చర్చించి.. మైత్రికి మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక, ఇప్పుడు సీఎం జగన్ ప్రధానితో భేటీ ఖరారు కావటంతో..ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. అదే విధంగా పాలనా పరమై అంశాల్లో సీఎం జగన్ ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉంది. దీంతో..ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications