నిజాంను స్మరించుకుంటే తప్పేంటి: కెసిఆర్, తెల్లదొర కాటన్ను..
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ (అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన- 2015)ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి, డిప్యూటీ సిఎం మహమూద్ ఆలీ, ఎంపి కె కేశవరావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నుమాయిష్ ప్లాటినం జూబ్లీ సావనీర్ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిజాం గొప్ప ప్రభువని, అయితే ఆయన కొన్ని విషయాల్లో తప్పులు చేశారని అన్నారు. తెల్లదొర కాటన్ను స్మరించుకుంటున్నారని, నిజాంను స్మరించుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు నిజాం నిర్మించినవేనన్నారు.

హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కన్నా అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వం తరపున భూమిని కేటాయిస్తామని కెసిఆర్ అన్నారు. హైదరాబాద్లో భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఉందని అన్నారు. 15ఏళ్ల కిందటే హైదరాబాద్ గ్రిడ్ లాక్ అయిందని, పైవంతెనలు కూడా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం లేదన్నారు. డల్లాస్లో మాదిరి హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని కెసిఆర్ చెప్పారు.
ఈసారి సుమారు 20 లక్షల మంది ఎగ్జిబిషన్ను సందర్శించనున్నట్లు అంచనా వేస్తున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి నరోత్తం రెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్లో సుమారు 2500 స్టాళ్లను ఏర్పాటు చేశారు. కాగా, జనవరి 1న ప్రారంభమైన ఈ నుమాయిష్ ఫిబ్రవరి 15 వరకు అంటే 45 రోజులపాటు కొనసాగనుంది. ఈ ఏడాదితో నుమాయిష్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన హరీష్రావు
మెదక్: గజ్వేల్లోని బాలుర సంక్షేమ హాస్టల్లో మంత్రి హరీష్రావు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్రావు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. జనవరి 1నుంచి వసతి గృహాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
గుజరాత్ను మించిన అభివృద్ధి: తుమ్మల
ఖమ్మం: గుజరాత్ను మించి తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా ఏన్యూరులో పాఠశాలలు, వసతి గృహాలకు సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమాన్ని పరుగెత్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. నిధులకు వెనుకాడకుండా జలవలయం ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకుపోతోందని తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో తాగునీటి కొరత లేకుండా చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications