జగన్ మదిలో గ్రేటర్ రాయలసీమ: వైసీపీకి కంచుకోటగా మార్చేందుకా : ఏం చేయబోతున్నారు..!
ఏపీ నూతన సీఎం జగన్ సరి కొత్త నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన ముందు నుండి రాయలసీమ వాసుల్లో తమను పట్టించుకోవటం లేదనే భావనను తొలిగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా అయిదు జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఈ ప్రతిపాదన పైన సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు. దీని ద్వారా పాలనా పరంగానే కాకుండా..రాజకీయంగానూ సీమను వైసీపీ కంచుకోటగా మార్చుకొనే వ్యూహాలను అమలు చేస్తున్నారు.
అయిదు జిల్లాలతో గ్రేటర్ సీమ...
ఏపీ రాష్ట్ర విభజన సమయంలో తమను తెలంగాణతో కలపాలని చాలా మంది రాయలసీమ నేతలు డిమాండ్ చేసారు. రాయలసీమలొ హైకోర్టు ఏర్పాటు చేయాలని అక్కడి న్యాయవాదులు ఆందోళన చేసారు. తాగు-సాగు నీటి పైనా అనేక డిమాండ్లు ఉన్నాయి. ఏపీలో ఎక్కువ కాలం రాయలసీమ ప్రాంతానికి చెందిన వారే ముఖ్యమంత్రులుగా పని చేసారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సైతం అదే ప్రాంతానికి చెందిన వారే. ఇక, ఇప్పుడు జగన్ సీమ వాసుల మనస్సుల్లో ఉన్న భావాన్ని తొలిగించేందుకు కొత్త ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. సీమలో ఉన్న కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలతో పాటుగా కరువు ఎక్కువగా కనిపించే ప్రకాశం జిల్లాను కలిపి అయిదు జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు కు విస్తృత కసరత్తు చేస్తున్నారు. దీని కారణంగా పాలనా పరంగా గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో కొత్త నిర్ణయాలు అమలు చేయటానికి వీలు కలుగుతుంది.
జిల్లాల పెంపులో భాగంగానే..
రాయలసీమను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన పోగొట్టేందుకు..అదే సమయంతో జగన్ ద్వారా ఎంతో కొంత మేలు జరిగిందనే అభిప్రాయం కలిగించేందుకు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీలోని 13 జిల్లాలను లోక్సభ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలుగా చేసేందుకు జగన్ ఇప్పటికే నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం ఉన్న లోక్సభ నియోజకవర్గాలు 2026లో జరిగే నియోజవకర్గాల పునర్విభజన ద్వారా మరోసారి రూపు రేఖలు మారనున్నాయి. దీంతో .. ఆ అయిదు జిల్లాల్లో నియోజకవర్గాల సరిహద్దులు ఎలా ఉన్నా..ఆ జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటు చేయటం ద్వారా ప్రభుత్వం తీసుకొనే ప్రత్యేక నిర్ణయాలతో అక్కడి ప్రజలకు మేలు చేయవచ్చని భావిస్తున్నారు. ప్రతీ ఏటా ఒక సారి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ..అమరావతి మాత్రమే కాకుండా పాలనా పరంగా కొన్ని ముఖ్య కార్యాల యాల ఏర్పాటు..అధికార వికేంద్రీకరణ ద్వారా సీమ వాసుల్లో భవిష్యత్ నష్టపోయామనే భావన తొలిగించాలని జగన్ భావిస్తున్నారు.
రాజకీయంగానూ పట్టు సాధించేందుకు..
తాజాగా జరిగిన ఎన్నికల్లో రాయలసీమలో జగన్కు పట్టం కట్టారు. నాలుగు జిల్లాల సీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానా లు ఉన్నాయి. ఇప్పుడు ప్రకాశం సైతం కలిపితే మరో 12 స్థానాలు పెరగనున్నాయి. తాజా ఎన్నికల్లో కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా, చిత్తూరు జిల్లాలో ఒక్క సీటు..అనంతపురంలో రెండు సీట్లు..ప్రకాశంలో నాలుగు సీట్లు వైసీపీ కోల్పోయింది. దీంతో...తనకు పట్టం కట్టిన రాయలసీమకు గతం కంటే మెరుగ్గా చేసి గ్రేటర్ రాయలసీమ పరిధిని తనకు రాజకీయంగా కంచుకోటగా మార్చుకోవాలని జగన్ వ్యూహం. అందులో భాగంగానే అక్కడి సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్లో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎటువంటి ప్రభావం చూపుతాయో చూడాలి.