కేబినెట్ మీటింగ్లో సీఎస్ సంగతి తేల్చేస్తానంటున్న బాబు ! కాని "కీ" ఉన్నది ఎల్వీ చేతుల్లోనే కదా?
Recommended Video
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇక వెనక్కు తగ్గేదే లేదంటున్నారు. ఏది ఏమైనా ముందకే వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం ఓ కీలక సమావేశానికి వచ్చే వారం ముహూర్తంగా ఫిక్స్ చేసారు. నిబంధనలు అతిక్రమిస్తూ ఊరుకొనేది లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రకటన దగ్గర నుండి ఈ రోజు వరకు ముఖ్యమంత్రి వర్సెస్ ఎన్నికల సంఘం, అదే విధంగా సీయం వెర్సెస్ సీఎస్గా పరిస్థితి మారింది. ఈ పరిస్థితుల్లో కేబినెట్ సమావేశానికి సీఎం సిద్దం అవుతున్నారు. మరి ఎన్నికల సంఘం ఏం చెబుతోంది..అధికారులు ఏం చేయబోతున్నారు..అది సాధ్యమేనా..
కేబినెట్ నిర్వహణకు నిర్ణయం..
ఏపీలో ఎన్నికలు ముగిసాయి. కానీ, కోడ్ మాత్రం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం..సీఎస్ వర్సెస్ ముఖ్యమంత్రి అన్నట్లుగా ఏపీలో పరిస్థితి తయారైంది. సీఎస్గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ముఖ్యమంత్రి వద్ద సమీక్షకు హాజరు కాలేదు. పైగా ఎవరి సమీక్షలకు ఎన్నికల కోడ్ కారణంగా హాజరు కావద్దని అధికారులకు స్పష్టం చేసారు. ఫలితంగా సీఎం సమీక్షలకు దూరంగా ఉంటున్నారు. అదే విధంగా మంత్రులు సైతం సమీక్షలు చేయటం లేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎల్వీ ఆయనకు అధికారాలు లేవంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీని మీద సీఎం సీరియస్గా ఉన్నారు. ఎలాగైనా సీఎస్తో పాటుగా ఎన్నికల సంఘానికి ఎలాగైనా సమాధానం చెప్పాలని నిర్ణయించారు. దీని కోసం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి..అందులో ఏ రకంగా ముందుకు వెళ్లాలో డిసైడ్ అవ్వాలని భావిస్తున్నారు.
చెక్ పెట్టేందుకే ఆ సమావేశం..
ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చేవారం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పైన ఫైర్ అవుతున్న సమయంలో..అధికారులు ఎవరైనా బిజినెస్ రూల్స్ పాటించాల్సిందేనని.. కేబినెట్ సమావేశంలో మొత్తం వ్యవహారం పైన చర్చిస్తామని సీఎం స్పష్టం చేసారు. అయితే, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కేబినెట్ సమావేశం నిర్వహించటానికి వీల్లేదని అధికారులు కోడ్ చేస్తున్నారు. మరి..కేంద్ర ప్రభుత్వం నాలుగు సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించిందని..వారికి లేని నిబంధనలు తమకు మాత్రమే ఎందుకు అమలు చేస్తున్నారని సీఎం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు కోడ్ పేరుతో తాము నిబంధనలకు కట్టుబడి ఉన్నా..ఉద్దేశ పూర్వకంగానే తనను లక్ష్యంగా చేసుకున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో పాటుగా న్యాయ పరంగా ఉన్న అవకాశాలను మంత్రి వర్గ సహచరులతో చర్చించి..ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టేందుకే సీఎం సడన్గా కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
సీఎస్ విషయంలో ఏం చేద్దాం..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యంను ఎన్నికల సంఘం నియమించిన నాటి నుండి సీఎం ఆగ్రహంతో ఉన్నారు. సీఎస్ జగన్ కేసుల్లో సహ నిందితుడని వ్యాఖ్యానించటంతో సీఎస్ సైతం సీఎంతో దూరంగా ఉంటున్నారు. ఇక, తిరుమలలో బంగారం రవాణా పైన విచారణ కమిటీ వేయటం..ప్రభుత్వంలో నిధుల మంజూరు పైన ఆర్దిక శాఖ సమీక్షలో తప్పులు వెతకటం పైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు సీఎస్ ఏ విషయం రిపోర్ట్ చేయటం లేదని సీఎం స్వయంగా వెల్లడించారు. దీంతో, ఎలాగైనా సీఎస్కు చెక్ పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, అసలు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలంటే అజెండా ఫిక్స్ చేయటం తో పాటుగా అధికారులను పూర్తి సమాచారంతో హాజరు అవ్వాలంటూ ఆదేశించేది సీఎస్. మరి, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని సీఎస్ అమలు చేస్తారా..లేక కోడ్ పేరుతో కేబినెట్ సమావేశ నిర్వహణకు అడ్డు పడుతారా అనేది చూడాల్సి ఉంది.