ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
శాసనమండలి సభ్యుడు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ భార్య స్వర్ణ కుమారి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతిక కాయానికి జగన్ దంపతులు నివాళి అర్పించారు.
విజయవాడ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు, ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య స్వర్ణ కుమారి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. స్వర్ణ కుమారి భౌతిక కాయాన్ని విజయవాడ గొల్లపూడి లోని తలశిల రఘురామ్ నివాసానికి తరలించారు.
స్వర్ణకుమారి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్వర్ణ కుమారి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. వైఎస్ జగన్, ఆయన భార్య వైఎస్ భారతి.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి గొల్లపూడికి చేరుకున్నారు.
ఈ మధ్యాహ్నం గొల్లపూడిలో స్వర్ణకుమారి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైఎస్ జగన్ ఆప్తమిత్రుడిగా, నమ్మకస్తుడిగా తలశిల రఘురామ్ కు పేరుంది. ఆవిర్భావం నుంచీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తోన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. 1996 నుంచి 2002 వరకు కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్తగా వ్యవహరిస్తోన్నారు. తలశిల రఘురాంకు 2021లో జరిగిన ఏపీ శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే కోటాలో టికెట్ కేటాయించారు వైఎస్ జగన్. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.