‘అన్నా’ అని పిలిచిన యువతి.. వెంట వెళ్లిన సీఎం జగన్: బాధితులకు అండగా ఉంటానంటూ భరోసా
అమరావతి: చిత్తూరు జిల్లాలోని వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో రెండవ రోజు పర్యటనలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని సరస్వతి నగర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఆ సమయంలో అక్కడకు వైష్ణవి అనే ఓ యువతి వచ్చింది. నేరుగా సీఎం జగన్ దగ్గరకు వెళ్లి తమ సమస్యను చెప్పింది.
అన్నా అంటూ సీఎం జగన్ వద్దకు వచ్చిన యువతి..
'అన్నా.. అమ్మ నిన్ను అమ్మ చూడాలని అంటోంది' అని చెప్పింది. 'అన్నా' అన్న పిలుపుకు కరిగిపోయిన సీఎం జగన్ వైష్ణవి ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లి.. అనారోగ్యంతో ఉన్న ఆమె తల్లి విజయలక్ష్మిని పరామర్శించారు. ఐదు రోజులు క్రితం మహిళ యునివర్సటీ వద్ద రోడ్డు ప్రమాదంలో విజయలక్ష్మి తీవ్రంగా గాయపడింది.తిరుపతి స్విమ్స్లో హెడ్ నర్స్గా చేస్తున్న విజయలక్ష్మి ప్రమాదంలో గాయ పడటంతో కదలలేని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్మోహన్రెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్న విషయం తెలుసుకుని కూతురు వైష్ణవి ద్వారా 'అమ్మా.. సీఎం జగన్ అన్నను చూడాలని ఉంది.. నా మాటగా చెప్పు తల్లి' అని కూతుర్ని ప్రాధేయ పడింది. తల్లి ఆశను సీఎం దృష్టికి తీసుకువెళ్ళింది వైష్ణవి.'అన్నా.. అమ్మ నిన్ను చూడాలని అంటుంది' అని చెప్పడంతో సీఎం జగన్.. వారి ఇంటికి వెళ్లి విజయలక్ష్మిని పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. సీఎం సహాయనిధి నుంచి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం వచ్చి పరామర్శించడంతో ఆ తల్లి కూతుళ్ల ఆనందం వ్యక్తం చేశారు.
మహిళ కన్నీరు.. అండగా ఉంటానన్న సీఎం జగన్
ఇది ఇలావుండగా, సీఎం జగన్ నెల్లూరు భగత్సింగ్ కాలనీలో పర్యటిస్తుండగా.. వేళాంగిణి అనే మహిళ వచ్చి తన సమస్యలను చెప్పుకుంది. కన్నీటిపర్యంతమైంది. ఆమె ఆవేదన విని చలించిపోయారు సీఎం జగన్. అక్కడే ప్రజల సమక్షంలో ఆమెను ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. వేళాంగిణి కుమారుడికి ఉద్యోగం కల్పించి ఆదుకుంటానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. బాధితుల గోడు విని.. తక్షణమే స్పందించిన సీఎం జగన్పై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎంతో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థినిలు, మహిళలు పోటీలు పడ్డారు. మరోవైపు, తమను ఆదుకోవాలంటూ సీఎం జగన్ను కలిశారు కిడ్నీ పేషెంట్ బి కుసుమ కుటుంబ సభ్యులు. నడవడానికి ఇబ్బంది పడుతున్న కుసుమ పరిస్థితి చూసి తానే స్వయంగా వాళ్ళ ఇంటిలోనికి వెళ్లారు సీఎం జగన్. కుసుమ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇచ్చే ఫించను అందుతుందా? లేదా? అని వివరాలు తెలుసుకున్నారు. తనకు ప్రతినెలా పించను అందుతోందని తెలిపారు కుసుమ భర్త చంద్రశేఖర్. తన భార్యకు ఊపిరి తిత్తులులో నీరు చేరడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని .. ముఖ్యమంత్రికి తమ కష్టాలు చెప్పుకున్నారు కుసుమ కుటుంబసభ్యులు. కుసుమ వైద్య ఖర్చులకు తగిన ఆర్థిక సాయానికి భరోసా ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. వారి కుటుంబానికి తగిన సాయం చేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video
అందరినీ ఆదుకుంటాం: బాధితులకు సీఎం జగన్ సూచన
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. నెల్లూరు జిల్లా వరద ప్రభావిత దామరపాలెం, జొన్నవాడ,పెనుబల్లి, భగత్ సింగ్ కాలనీల్లో పర్యటించారు సీఎం జగన్. బాధితులకు అందిన సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు రోజలు పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ ముంపు బాధితులకు అందిన సహాయక చర్యలపై ఆరా తీశారు. నష్టపోయిన ప్రతీ కుటుంబానికీ అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కాగా, వరద సాయం అందని వారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్ బాధితులకు సూచించారు. మరోవైపు, తుఫాను ముప్పు పొంచివుడటంతో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం జగన్. ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.