రాజధానిగా అమరావతి తాత్కాలికమే.. ట్విట్టర్ సంచలనం
అమరావతి: అపర కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్.. ట్విట్టర్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో- చాలామంది హైప్రొఫైల్ ట్విట్టర్ యూజర్లకు షాక్ తగిలింది. తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ బ్లూ టిక్ను వారు కోల్పోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, విజయసాయిరెడ్డి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఇలా చాలామంది ప్రముఖులు బ్లూటిక్ను కోల్పోయారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అధికారిక ట్విట్టర్ అకౌంట్ల బ్లూ టిక్ కూడా మాయమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తమ ట్విట్టర్ బ్లూ టిక్ను కోల్పోయారు.

బాలీవుడ్ సెలెబ్రిటీలు- అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అలియా భట్ సహా పలువురు సెలెబ్రెటీలు ఈ లిస్ట్లో ఉన్నారు. అమితాబ్ బచ్చన్తో పాటు కొందరి బ్లూ టిక్స్ను ట్విట్టర్ యాజమాన్యం పునరుద్ధరించింది. అలాగే- ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాల, విభాగాధిపతుల, డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఛైర్మన్ల అధికారిక అకౌంట్లకు గ్రే టిక్ను కేటాయించింది.
ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయానికి గ్రే టిక్ లభించింది. ప్రధానమంత్రి కార్యాలయం సహా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారిక ట్విట్టర్ అకౌంట్లు.. ఇదే టిక్ మీద కొనసాగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం లోకేషన్ను గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, ప్రభుత్వ భవన సముదాయాలుగా చూపించింది. ఇది- ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది.

వెలగపూడిలోని సచివాలయ భవన సముదాయాన్ని తాత్కాలికంగా చూపించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ సాగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం తాత్కాలికమేనని ట్విట్టర్ కూడా తేల్చేసిందని, త్వరలోనే వైఎస్ జగన్ విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించబోతోన్నారనడానికి ఇది నిదర్శనంగా చెబుతున్నారు ట్విట్టర్ యూజర్లు.
పరిపాలన రాజధాని విశాఖపట్నం ఉంటుందంటూ వైఎస్ జగన్ కూడా ఇటీవలే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తోన్నారు. సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగించనున్నట్లు- ఇటీవలే శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్ట్ నిర్మాణ పనుల శంకుస్థాపన సభలో జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్లోనే విశాఖకు తరలి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. మూడు రాజధానుల పిటీషన్లపై విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున దీన్ని సెప్టెంబర్కు పొడిగించారు.












Click it and Unblock the Notifications