ఉమ్మడి విశాఖ జిల్లా గజగజ- కనిష్ఠ ఉష్ణోగ్రత
Cold Wave: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీని తీవ్రత ఇంకా దక్షిణ కోస్తా- రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తోంది. అడపా దడపా తేలికపాటి జల్లులు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
వర్షాలకు చలి తోడయింది. క్రమంగా ఉష్ణోగ్రత క్షీణిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్కు పడిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నేలకొంటోంది. ఉత్తరాంధ్రలో చలి తీవ్రత మరింత అధికంగా ఉంటోంది. పలు ఏజెన్సీ గ్రామాల్లో టెంపరేచర్ దిగజారుతూ వస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలు చలికి గజగజమంటూ వణుకుతున్నాయి.

విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతోంది. వర్షాల తీవ్రత తగ్గినప్పటి నుంచీ ఒక్కసారిగా చలి పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో రెండువారాల వరకు ఇదే తీవ్రత కొనసాగే అవకాశాలు లేకపోలేదు.
24 గంటల వ్యవధిలో అరకులోయలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9.61 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అంతకుముందు ఈ నెల 15వ తేదీన అరకులో 3.8 డిగ్రీల సెల్సియస్ మేర టెంపరేచర్ రికార్డయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు గ్రామాల్లో 5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోతోంది ఉష్ణోగ్రత.
అరకు సమీపంలోని దళపతిగూడ- 9.89, జీ మాడుగుల- 10.05, కుంతాళం- 10.6, డుంబ్రిగూడ- 10.73, చింతపల్లి (ఏ)- 10.85 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరంలో 11.2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తోన్నారు.












Click it and Unblock the Notifications