'ప్చ్! వైయస్ వల్ల కాంగ్రెస్కు రావాల్సిన మైలేజి జగన్కు వెళ్లింది'
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన మైలేజ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్లిందని కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జయంతి సందర్భంగా ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరా భవన్లో వైయస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆస్తులను కాపాడుకునేందుకు కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని ధ్వజమెత్తారు. 1994లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి సంక్షోభమే ఎదురయిందన్నారు. రెండు రాష్ట్రాల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి వైయస్ అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైయస్ది అన్నారు. వైయస్ వల్ల కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన మైలేజి జగన్ పార్టీకి వెళ్లిందన్నారు.
అన్ని రంగాల వారిని ఆదుకున్న వ్యక్తి వైయస్ రాజశేఖర రెడ్డి అ్నారు. వైయస్ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల చీఫ్లు రఘువీరా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు కెవిపి, మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన హామీ నెరవేర్చలేదు: టీఆర్ఎస్పై జీవన్ రెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీని టీఆర్ఎస్ ఇంతవరకు నెరవేర్చలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ కార్మీకులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఇంత వరకు చేయలేదన్నారు. ప్రభుత్వం రాజకీయాలు మాని సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు.