టీలో బలిదానాలు కాంగ్రెసు పాప ఫలితమే: మోడీ
మహబూబ్నగర్: తెలంగాణలో 1100 మంది యువకుల బలిదానాలు కాంగ్రెసు పాపఫలితమేనని, కాంగ్రెసు అహంకారం వల్లనే బలిదానాలు జరిగాయని బిజెపి ప్రధాని అబ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. మహబూబ్నగర్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కలిసి తొలిసారి మంగళవారం ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణకు సంబంధించి ఈ ఎన్నికలు సామాన్యమైనవి కావని, వందేళ్ల తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించేవని ఆయన అన్నారు.
తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలని, ఓటేయడానికి వెళ్లే ముందు యువకుల బలిదానాలను గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, సాగునీరు లేకపోవడం వల్లనే అది జరిగిందని, సాగునీటి సౌకర్యం కల్పిస్తే బంగారం పండిస్తారని ఆయన అన్నారు.

పాలమూరు ప్రాజెక్టును నిర్మిస్తామని కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ఆయన ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు నిర్మించకుండా ఎవరు ఆపారని ఆయన అడిగారు. తెలంగాణకు ఏం కావాలో ఆలోచించాల్సిన సమయమని, ఢిల్లీలో తమ ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారం చేస్తామని ఆయన అన్నారు. ఈ విశ్వాసం కల్పించడానికే తాను వచ్చినట్లు ఆయన తెలిపారు.
కుటుంబ పాలనకు ప్రజలు మద్దతు ఇవ్వవద్దని ఆయన సూచించారు. ప్రజల చేతుల్లో బంగారు రేఖలను గీసే ప్రభుత్వం ఢిల్లీలో ఉండాలని ఆయన అన్నారు. రైతులకు మద్దతు ధర వినూత్నమైన పద్ధతిలో నిర్ణయిస్తామని, సాగు ఖర్చులను లెక్కలోకి తీసుకుని ఆ ధరను నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications