రెండే ఆప్షన్స్: గవర్నర్ నిర్ణయం ఎటువైపు?.. సర్వత్రా ఉత్కంఠ
Recommended Video
బెంగళూరు: ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనా ప్రకారమే కర్ణాటక ఎన్నికల్లో 'హంగ్' ఏర్పడింది. కానీ ఈ హంగ్ అక్కడి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలను తెరమీదకు తెచ్చింది. సీట్ల పరంగా మూడో స్థానానికి పరిమితమైన జేడీఎస్ ఏకంగా 'కింగ్' అయే ఛాన్స్ రావడం కర్ణాటక ఎన్నికల సిత్రం అనే చెప్పాలి.
ఇప్పటికైతే ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై గవర్నర్ నుంచి ఏ నిర్ణయం వెలువడలేదు. ఆయన నిర్ణయం బీజేపీకే అనుకూలంగా ఉండవచ్చన్న వాదన మాత్రం వినిపిస్తోంది. అయితే గవర్నర్ ముందు ఇప్పుడు ఉన్న ప్రధానంగా కనిపిస్తున్న ఆప్షన్స్ రెండే రెండు. ఒకటి సుప్రీం కోర్టు గత తీర్పుల ప్రకారం.. అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. రెండు.. గోవా, మణిపూర్, మేఘాలయాల రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన దానిని కాదని, సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన మోడల్ ను ఫాలో కావడం.
ఈ రెండింటిలో కర్ణాటక గవర్నర్ వజుభాయ్ ఎటువైపు మొగ్గుచూపుతారోనన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇదే అంశంపై స్పందించిన పలువురు న్యాయవాదులు సైతం భిన్నాభిప్రాయాలను వెలిబుచ్చారు. కొంతమంది అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని చెప్పగా.. మరికొంతమంది మాత్రం పూర్తి మెజారిటీ ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
అయితే ఈ విషయంలో గవర్నర్ నిర్ణయమే అంతిమం అని చెప్పారు. మాజీ అటార్నీ జనరల్ రోహ్ తగి మాట్లాడుతూ.. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అభిప్రాయపడ్డారు. ద్విదేది, గోయల్ అనే ఇద్దరు సీనియర్ న్యాయవాదులు ఆయన అభిప్రాయంతో విభేదించారు.
ధావన్ అనే మరో సీనియర్ న్యాయవాది కూడా అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్నారు. ఒకవేళ బలనిరూపణలో గనుక ఆ పార్టీ విఫలమైతే సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. గతంలో గోవా, మణిపూర్ ఎన్నికల్లో తప్పిదం జరిగిందన్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ను కాదని, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం తప్పిదమేనని అన్నారు.
మరో సీనియర్ న్యాయవాది, బీజేపీ అధికార ప్రతినిధి అమన్ సిన్హా గతంలో అపెక్స్ కోర్టు న్యాయమూర్తులు ఎస్ఆర్ బొమ్మై(1994), రామేశ్వర్ ప్రసాద్ తీర్పులను గుర్తుచేశారు. దాని ప్రకారం స్థిరమైన, సమర్థవంతమైన పాలన అందించగల పార్టీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి మాత్రమే ఆ అవకాశం దక్కుతుందన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీని అంతలా ఓన్ చేసుకున్నారని, ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కౌంటర్:
అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్న వాదనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. దీనికి ఆ పార్టీ గట్టి కౌంటరే ఇస్తోంది. గతంలో గోవా ఎన్నికల ఫలితాల సమయంలో అరుణ్ జైట్లీ చేసిన ఓ ట్వీట్ తో బీజేపీని కౌంటర్ చేస్తోంది.
'హంగ్ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించిన గవర్నర్ నిర్ణయం రాజ్యాంగబద్దమైనదే' ఆ సమయంలో జైట్లీ ట్వీట్ చేశారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ను కాదని, అప్పట్లో స్వతంత్రులు మరో రెండు చిన్న పార్టీలతో కలిసిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం కల్పించారు.
మరో సీనియర్ న్యాయవాది సావంత్ కూడా కాంగ్రెస్ పార్టీ వాదనను సమర్థించారు. 'బీజేపీ కంటే ఎక్కువ సీట్లు కలిగి ఉన్నందునా.. గవర్నర్ కాంగ్రెస్, జేడీఎస్ లను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. అయితే అసెంబ్లీలో బలనిరూపణ తప్పనిసరి.' అని చెప్పుకొచ్చారు.
ఏదేమైనా కర్ణాటక ఎన్నికల ఫలితాలు గవర్నర్ ముందు ఇప్పుడో పెద్ద సవాల్ లాగా మారాయి. కాబట్టి ఆయన నిర్ణయం ఎటువైపు ఉంటుందనేది సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తోంది.