ఏం చేసినా భయపడం .. వైసీపీది రాక్షస,అవినీతి పాలన : చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్నారు . వైసీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన తన పర్యటన కొనసాగించారు. ఇక ప్రజా చైతన్య యాత్రలో 9 నెలల వైసీపీ పాలనను ఆయన ఎండగట్టారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందుల తరహా రౌడీయిజం చేయాలని చూస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు.

కుప్పం ప్రజా చైతన్య యాత్రలో జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
వైసీపీ పాలన అవినీతి పాలన అని, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజల్ని చైతన్య పర్చేందుకే ప్రజాచైతన్య యాత్ర చేపట్టినట్లు చెప్పిన చంద్రబాబు తన మీద అవినీతి మరకలు వెయ్యటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని , ఇక వై ఎస్సార్ హయాంలో తనపై 26 సార్లు ఎంక్వైరీ వేసి ఒక్కటీ నిరూపించలేదన్నారు. ఇక సీఎం జగన్ ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఇబ్బందుల్లో పెట్టడమే పనిగా పెట్టుకుని ఏదో చెయ్యాలని చూస్తున్నారని అన్నారు .

సిట్ వేసినా .. ఇంకేం చేసినా భయపడమన్న మాజీ సీఎం
టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని వెయ్యటం అన్యాయం అని ప్రభుత్వం సిట్ వేసినా, ఇంకేం చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. హంద్రీనీవా నీళ్లు కుప్పంకి రాకుండా అడ్డుకుంటున్నారని, అక్రమంగా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు చంద్రబాబు . ఇక పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, పోలీసులు ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని పేర్కొన్నారు చంద్రబాబు .

గ్రామాల్లో జే ట్యాక్స్ వసూలు .. వైసీపీ హయాంలో అరాచకం అన్న బాబు
వైసీపీ అధికారం చేపట్టక ఇసుక కొరత సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు . గ్రామాల్లో ఇసుక కొరత సృష్టించి పేదల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. పక్క రాష్ట్రంలో ఇసుక సంవృద్ధిగా దొరుకుతోందని.. ఏపీ ప్రజలకు మాత్రం ఇసుక లేకుండా చేశారని విమర్శించారు. గ్రామాల్లో జబర్దస్త్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రభుత్వాలు శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు హితవుపలికారు. సీఎం జగన్ అన్న క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపుకొట్టారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలన అంతా అరాచక పాలన అని చెప్పిన చంద్రబాబు జగన్ పాలనకు చరమగీతం పాడాలని చెప్పారు.












Click it and Unblock the Notifications