హీరోలు, సెలెబ్రిటీల గురించి పవన్ ఇలా చెప్పాడేంటీ?
Pawan Kalyan: పాకిస్తాన్ పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహించింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, ఆ పార్టీ రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు పురంధేశ్వరి.. ఈ ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ మూడు పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు దీనికి హాజరయ్యారు. జాతీయ జెండాలను చేతబట్టుకుని సైనికులకు సంఘీభావం తెలియజేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. వందే మాతరం అంటూ నినదించారు. భారత ఆర్మీ పరాక్రమానికి గుర్తుగా 175 నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీని చేపట్టామని అన్నారు. 18వ తేదీ వరకు ఈ తిరంగ యాత్రలు కొనసాగుతాయని వివరించారు. ప్రజలందరూ ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
భారత్ ఎప్పుడు కూడా వేరే దేశంపై యుద్ధానికి పోలేదని, ఉగ్రవాదంపై మాత్రమే నిరంతరాయంగా పోరాడిందని అన్నారు. ఉగ్రవాదం.. ఈ ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తోందని, దీనిపై పోరాడే ఏకైక దేశం భారత్ ఒక్కటేనని అన్నారు. ఉగ్రవాదంపై పోరాడే నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక్కడేనని స్పష్టం చేశారు.
అత్యంత కఠిన పరిస్థితుల్లో సరిహద్దుల్లో రాత్రి పగలు తేడా లేకుండా దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని చంద్రబాబు అన్నారు. వాళ్లు పోరాడటం వల్లే తాము ఇక్కడ క్షేమంగా ఉండగలుగుతున్నామని చెప్పారు. దేశ బలం.. బలగం మొత్తం సైనికులేనని ప్రశంసించారు.
దేశ త్రివిధ దళాల పరాక్రమం ఎలాంటిదో ప్రపంచం మొత్తం చూసిందని, దేశ విదేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. తాము ఎవరి జోలికి వెళ్లబోమని, ఉగ్రవాదులు తమ జోలికి వస్తే మాత్రం వారికి అదే చివరి రోజు అవుతుందని ఆపరేషన్ సింధూర్ రుజువు చేసిందని చెప్పారు.
అంతకుముందు పవన్ కల్యాణ్ మాట్లాడారు. దేశ విభజన జరిగినప్పటి నుంచీ ఎప్పుడూ ప్రశాంతంగా లేదని అన్నారు. తమ దేశాన్ని తాము ఏలుకోలేక.. అభివ్రద్ది చెందుతున్న భారత్ ను చూసి అడుగడుగునా అడ్డుపడుతోందని చెప్పారు. ముంబై బాంబుదాడులు, కోయంబత్తూరు పేలుళ్లు, గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్, జామా మసీద్ పేలుళ్ల వెనుక పాక్ హస్తం ఉందని అన్నారు.
ఏపీలాగా జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలు ప్రశాంతంగా ఉండవని, పాకిస్తాన్ నుంచి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంటాయని చెప్పారు. అక్కడి ప్రజలకు తాము అండగా ఉండామనే సందేశాలను ఇలాంటి ర్యాలీల ద్వారా తెలియజేయాలని అన్నారు.
సూడో సెక్యులరిజం పేరుతో దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా, కించపరిచేలా ఎవరు ప్రవర్తించినా, వ్యాఖ్యానించినా, వాళ్లను బలంగా జవాబు చెప్పాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మురళీ నాయక్ సినిమాలు చూడలేదని, దేశాన్ని ప్రేమించి సైన్యంలో చేరాడని అన్నారు.

పహల్గామ్ దాడి, పాకిస్తాన్ పై భారత్ విజయంపై హీరోలు, సెలెబ్రిటీలు మాట్లాడట్లేదనడం సరికాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హీరోలు గానీ, సెలెబ్రిటీలు గానీ దేశాన్ని నడిపే వ్యక్తులు కాదని చెప్పారు. వాళ్లు ఎంటర్టైనర్లు, ఓ మంచి పెర్ఫార్మర్లు మాత్రమేనని తేల్చిచెప్పారు.
సెలెబ్రిటీల నుంచి దేశభక్తిని ఆశించకూడదని పవన్ కుండబద్దలు కొట్టారు. దేశభక్తి అంటే మురళీ నాయక్ వంటి కుర్రవాళ్ల నుంచే నేర్చుకోవాలని, దేశం కోసం ప్రాణాలను అర్పించాడని చెప్పారు. సైనికుడిగా, దేశ రక్షణలో తుదిశ్వాస విడిచాడని గుర్తు చేశారు. ఇది నయాభారతం అని, శాంతి కపోతాలను ఎగురవేయడం, సహనం అంటూ చేతులు ముడుచుకుని కూర్చునే దేశం కాదని అన్నారు.
తమ ఇళ్లల్లోకి వచ్చి దాడి చేస్తే.. వాళ్ల సరిహద్దులు దాటి వెళ్లి దాడి చేసి వచ్చామని, శాంతి పేరుతో ఎన్నాళ్లు చేతులు ముడుచుకుని కూర్చుంటామని అన్నారు. ఇన్నాళ్లు సహనంతో చేతులు కట్టేశారని, ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దులను దాటుకుని వెళ్లి కొట్టొచ్చామని, అలాంటి దేశమే ఇప్పుడు కావాలని చెప్పారు.
పాకిస్తాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలన్నింటినీ ఉపసంహరించుకునే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని పవన్ అన్నారు. ఇది తాత్కాలిక నిలుపుదల మాత్రమేనని చెప్పారు. ఇది విరామమే తప్ప ముగింపు కాదని ప్రధాని మోదీ స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల్లో తన స్థానాన్ని కోల్పోయిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications