ముందు భర్తను, తర్వాత భార్యను?..: ఒంగోలులో దంపతుల మిస్సింగ్ విషాదాంతం..
బంగారం కడ్డీలు ఇప్పిస్తానని డబ్బు గుంజిన బుడబుక్కల శ్రీనివాసులు ఈ హత్యలు చేసినట్లు గుర్తించారు.
ఒంగోలు: తక్కువ ధరకే బంగారు కడ్డీలు ఇప్పిస్తానని డబ్బు గుంజిన ఓ వ్యక్తి.. మాట నిలుపుకోలేదు సరికదా!.. ఏకంగా హత్యకు పాల్పడ్డాడు. అతని భార్యను కూడా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్నాడు.
మంగళవారం రాత్రి మార్కాపురం ప్రాంతంలో నిందితుడు పట్టుబడటంతో హత్య వెనుక అసలు కోణం వెలుగుచూసింది. హత్యకు సంబంధించి ఒంగోలు పోలీసులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వారం క్రితం అదృశ్యం:
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇస్లాంపేటకు చెందిన పల్లపోతు శ్రీనివాసులు(41), అతని భార్య ప్రమీలాదేవి(35) వారం క్రితం అదృశ్యమయ్యారు. స్థానికంగా ఇనుము వ్యాపారం చేసే పల్లపోతు శ్రీనివాసులకు మరో ఇనుము వ్యాపారి బుడబుక్కల శ్రీనివాసులుతో పరిచయం ఉంది. ఆ పరిచయం వీరిని బలితీసుకున్నట్లు తాజాగా స్పష్టమైంది.
తక్కువ ధరకే బంగారం అని:
చాలా రోజుల నుంచి పల్లపోతు శ్రీనివాసులు, బుడబుక్కల శ్రీనివాసులు మధ్య ఇనుము వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇటీవల పల్లపోతు శ్రీనివాసులు వద్దకు వచ్చిన బుడబుక్కల శ్రీనివాసులు.. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన పల్లపోతు శ్రీనివాసులు రూ.15లక్షలు ఇచ్చాడు.
ఆ తర్వాత ఎప్పుడు అడిగినా.. సమాధానం దాటవేయడంతో తాను మోసోయానని పల్లపోతు శ్రీనివాసులుకు అర్థమైంది. దీంతో తన డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ బుడబుక్కల శ్రీనివాసులపై పల్లపోతు శ్రీనివాసులు ఒత్తిడి పెంచుతూ వస్తున్నాడు.
ముందు భర్తను, తర్వాత భార్యను:
28వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో బుడబుక్కల శ్రీనివాసులు పల్లపోతు శ్రీనివాసులు ఇంటికి వచ్చాడు. డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. కారులో వెళ్తున్న సమయంలో మరికొందరితో కలిసి హత్య చేశాడు.
ఆ తర్వాత అదే కారులో మళ్లీ పల్లపోతు శ్రీనివాసులు ఇంటికెళ్లాడు. భర్త తీసుకురమ్మన్నాడని చెప్పి అతని భార్య ప్రమీలా దేవి(35)ని కూడా తీసుకెళ్లి హత్య చేశాడు. ఆ రాత్రి నుంచి శ్రీనివాసులు దంపతులు కనిపంచకపోవడంతో.. 30న ఒంగోలు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
మార్కాపురంలో పట్టుబడ్డాడు:
ఒంగోలు ఎస్పీ బి.సత్య సుబాబు, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐ ఎండీ ఫిరోజ్తో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలతో దంపతుల అదృశ్యంపై దర్యాప్తు ప్రారంభించారు. దీంతో మంగళవారం రాత్రి మార్కాపురం ప్రాంతంలో నిందితుడు పట్టుబడ్డాడు.
దంపతులను హత్య చేసి ఒంగోలు ఎస్ఎస్ ట్యాంక్-1కు పడమర బైపాస్కు సమీపంలోని చెట్లలో పూడ్చి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.గురువారం రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను బయటకు తీసి పంచనామా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.