రామోజీరావుకు చుక్కెదురు: స్థలం ఖాళీకి ఆదేశాలు
వర్మకు చెందిన సీతమ్మధారలోని 2.78 ఎకరాల స్థలాన్ని 30 వేల చదరపు గజాల భవనాన్ని 33 ఏళ్ల కాల పరిమితికి ఈనాడు అధినేత రామోజీరావు 1973లో అద్దెకు తీసుకున్నారు. మొదట ఈ భవనానికి నెలకు 2,500 రూపాయలు, ఆ తరువాత 3000 రూపాయలు చెల్లిస్తూ వచ్చారు. 2007 ఏప్రిల్లో భవన అద్దెను పెంచాల్సిందిగా ఈనాడు యాజమాన్యాన్ని స్థల యజమాని కోరినా వారు తిరస్కరించారు.
అద్దె చెల్లించకపోవడంతో వర్మ రెంట్ కంట్రోల్ కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు వర్మకు అనుకూలంగా తీర్పునిచ్చింది. స్థానిక రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఈ తీర్పును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దాంతో వర్మ హైకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది అక్టోబర్లో హైకోర్టు తీర్పు వెలువరించింది. నెలకు 17 లక్షల రూపాయల అద్దె, పాత బకాయిలు 2.06 కోట్ల రూపాయల ఈనాడు యాజమాన్యం చెల్లించగలిగితే, సదరు స్థలంలో ఈనాడు కార్యాలయం కొనసాగవచ్చని ఆ తీర్పు సారాంశం.
ఈ మొత్తాన్ని ఈ నెల 10వ తేదీలోగా చెల్లించాల్సి ఉంది. కానీ, ఆ మొత్తాన్ని చెల్లించకుండా ఈనాడు యాజమాన్యం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయాల్సిందిగా ఆదేశించింది.
అలాగే భవనాన్ని ఖాళీ చేయడానికి రెండు నెలలు గడువు కోరినా, సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో సీతమ్మధారలోని ఈనాడు భవనాన్ని ఖాళీ చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈనాడు కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు.