భూమా అఖిలప్రియపై కీలక నిర్ణయం తీసుకున్న కోర్టు
తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) ఇటీవలే అరెస్టయ్యారు. ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కర్నూలు జైలు నుంచి ఆమెను విడుదల చేయనున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన భూమా అఖిలప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిద్దర్నీ పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు.
నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించిన సమయంలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు ఈ నెల 17న కొత్తపల్లి వద్ద భారీ గా స్వాగత ఏర్పాట్లు చేశాయి. ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడమే కాకుండా ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఈ ఘటనలో అఖిలప్రియ దంపతులను అరెస్ట్ చేసి పాణ్యం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సెక్షన్ 307 కింద అఖిలప్రియ, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదన్నారు. జరిగిన సంఘటనపై ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచి తాను, తన కుటుంబ సభ్యులు పోటీ చేయాలనే పట్టుదలతో అఖిలప్రియ ఉన్నారు. తనకు ఆళ్లగడ్డ, తన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి నంద్యాల నియోజకవర్గాలు కేటాయించాలని చంద్రబాబును కోరుతున్నారు. కొన్ని నియోజకవర్గాలకు ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోన్న చంద్రబాబు ఆళ్లగడ్డ, నంద్యాల విషయంలో మాత్రం వేచిచూసే ధోరణిని కనపరుస్తున్నారు.













Click it and Unblock the Notifications