ఏపీలో కరోనా: కొత్తగా 9,999 కేసులు - డిశ్చార్జీల్లోనూ రికార్డు - ఉభయగోదావరిలో భయానకం
కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,999 కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. గత మూడు వారాలుగా ప్రతిరోజూ కొత్త కేసులు 10వేలకు తగ్గకుండా వస్తుండటం గమనార్హం. కొత్తవాటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5.47లక్షలకు పెరిగాయి.

జిల్లాల వారీగా మరణాల సంఖ్య..
ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం గత 24 గంటల్లో కరోనా వల్ల 77 మంది ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లాలో అత్యధికంగా 9మంది, చిత్తూరులో 8 మంది, నెల్లూరులో 8, ప్రకాశం 8, గుంటూరులో 7, కృష్ణాజిల్లాలో 7, అనంతపురంలోఆరుగురు, విశాఖపట్నం జిల్లాలో ఆరుగురు, విజయనగరంలో 5, పశ్చిమగోదావరిలో 5, తూర్పుగోదావరిలో 4, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 4779కి పెరిగింది.

ఆ రెండు జిల్లాల్లో భారీగా..
కొత్త కేసుల కు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి భయానకంగా కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరిలో కొత్తగా 1499 కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎక్కువ కేసులున్న(73,996) జిల్లా తూర్పుగోదావరే. ఇక పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా 1081 కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 48,329గా, మరణాలు 381గా ఉన్నాయి. అటు చిత్తూరు జిల్లాలోనూ గత 24 గంటల్లో 1040 కొత్త కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. మరణాల పరంగా చిత్తూరు(512) టాప్ లో ఉంది. ఇక్కడ మొత్తం కేసులు 47,509గా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కొత్తగా 901 కేసులు, గుంటూరులో 920 కొత్త కేసులు వచ్చాయి.

భారీగా డిశ్చార్జీలు..
ఏపీలో కొత్త కేసులతోపాటే డిశ్చార్జీలు కూడా భారీ గా ఉంటుండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 11, 069 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పటిదాకా వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4.46లక్షలకు చేరింది. 96,191 యాక్టివ్ కేసులతో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో 71,137 శాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటివరకు మొత్తం 44.52లక్షల కరోనా టెస్టులు నిర్వహించామని ఆరోగ్య శాఖ బులిటెన్ లో పేర్కొంది.












Click it and Unblock the Notifications