ఏపీలో కరోనా: పెరిగిన కేసులు -కొత్తగా 377, నలుగురు మృతి -చిత్తూరులో మళ్లీ పైపైకి
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. రాష్ట్ర వైద్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 51,420 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, కొత్తగా 377 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 8,83,587కి చేరింది.
కరోనా మహమ్మారి బారిన పడి మంగళవారం నలుగురు మరణించారు. చిత్తూరు జిల్లాలో ఒకరు, గుంటూరులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 7,122కు చేరింది.
రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. మంగళవారం 278 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటిదాకా కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,73,427కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,038కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,20,53,914 శాంపిల్స్ను పరీక్షించినట్లు బులెటిన్లో పేర్కొన్నారు.
కొత్తగా వెలుగుచూసిన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో82 కేసులు వచ్చాయి. ఇక, కర్నూలులో అత్యల్పంగా 5 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు సైతం రాష్ట్రంలోనే అత్యల్పంగా 39 ఉన్నాయి.