'టీడీపీ నిజ స్వరూం ఇదీ': 'ఫిరాయింపులపై చంద్రబాబుకి గుణపాఠం చెప్పాలి'
అమరావతి: విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధరా? లేక మంత్రి నారాయణ? అర్థం కాని పరిస్థితి నెలకొందని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ఎద్దేవా చేశారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
కార్పోరేషన్ కౌన్సిల్తో నిమిత్తం లేకుండా మంత్రి నారాయణ నీటి మీటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఆయన ప్రశ్నించారు. నీటి మీటర్ల ఏర్పాటుకు అధికారులు హడావుడి చేస్తున్నా నగర మేయర్ కోనేరు శ్రీధర్ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నీటిమీటర్లను వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టులతో కలిసి ఆందోళన చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు అధికారంలోకి రాగానే తన నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కార్పొరేటర్లు అధ్యయన యాత్ర పేరుతో విహార యాత్రకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ సారాంశాన్ని చదివి వినిపించారు. విజయవాడ నగర పాలక సంస్థ రూ. 350 కోట్లు అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్లానింగ్, నాన్ప్లానింగ్ గ్రాంట్ రాబట్టాలని డిమాండ్ చేశారు.
అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారు
రాష్ట్రంలో చంద్రబాబు సాగిస్తున్న అనైతిక రాజకీయాలు, అవినీతి పాలనకు అడ్డుకట్ట వేయడానికి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కల్లత్తూరు నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం రాచపాళ్యంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్.శివప్రకాశ్రాజు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు సాగిస్తున్న అనైతిక రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలోపేతం చేసేందుకు పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను గాలికొదిలేసి అమరావతి పేరుతో అక్రమంగా దోచుకున్న అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు.
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరోక పార్టీలో చేరిన నాయకులపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబుకి గుణపాఠం చెప్పాలంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేయడానికి కార్యకర్తలు సైనికుడిలా పని చేయాలన్నారు.