'ఎమ్మెల్యేలను కొనే ఉద్దేశంతోనే టీడీపీ నాలుగో అభ్యర్ధి'
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాలుగో అభ్యర్ధిని నిలబెట్టడంపై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. టీడీపీ నాలుగో సీటు అభ్యర్ధిత్వంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతోనే నాలుగో అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించాలని చూస్తోందన్నారు.
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే రాజ్యసభ ఎన్నికల్లో కూడా డబ్బులు పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోనుగోలు చేసే ఉద్దేశ్యంతోనే నాలుగో అభ్యర్ధిని బరిలో నిల్చోబెడుతున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాజ్యసభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు కొనసాగించే దిశగా ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని అన్నారు. కేసీఆర్కు తగిన బలం ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహించారని, అలాగే చంద్రబాబూ పోటీపడి కొనుగోలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రజలే అసలైన ప్రతిపక్షమని అన్నారు. బహిరంగంగా ఫిరాయింపు నిరోధక చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశామని, అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై కత్తి వేలాడుతోందని, మళ్లీ అదే తప్పు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యూహానికి, వ్యభిచారానికి తేడా ఉందని చెప్పారు. రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని అంటే బతుకు కోసం చేశామని నేతలు సమర్ధించుకోవడం దారుణమని అన్నారు.












Click it and Unblock the Notifications