చంద్రబాబును కలిసిన రాజధాని రైతులు...రిజిస్ట్రేషన్లకు కోసం విన్నపం...
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రాజధాని రైతులు కలిశారు. తుళ్లూరులో ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ జరిగిన సందర్భంగా సీఎంతో వీరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిఎంతో తమ బాధలను ముఖ్యమంత్రితో చెప్పుకున్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ విషయంలో సిఆర్డిఎ అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
సీఆర్డీఏ లెక్కల ప్రకారం 22,525 మందికి రైతులకు 56,971 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చెయ్యాల్సి ఉంది. ఈ ప్లాట్లన్నింటికీ రోడ్డు, అండర్ గ్రౌండ్, డ్రెయినేజీ, కేబుల్స్, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించి అప్పగించేందుకు సైతం ప్రభుత్వం అంగీకరించింది.
అయితే సీఆర్డీఏ అధికారులు తమకు ప్లాట్లను కేటాయించినప్పటికీ ఇంతవరకు రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని మాత్రం కల్పించలేదని సిఎం చంద్రబాబును కలిసిన రాజధాని రైతులు ఫిర్యాదు లాంటి విన్నపం చేశారు. వీరి విన్నపాన్ని సానుకూలంగా విన్న చంద్రబాబు త్వరలోనే తాను ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అయ్యేలాగా చూడాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి హామీతో రైతులు సంతృప్తి చెంది వెనుదిరిగారు.