జివోఎంకు కిరణ్ కుమార్ నివేదికలోని అంశాలు ఇవే...!
హైదరాబాద్/న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రుల బృందం (జివోఎం) ఎదుట సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు హాజరై గంటన్నర పాటు సమైక్య గళం వినిపించారు. జివోఎంకు కిరణ్ రెండు నివేదికలు ఇచ్చారు. 86 పేజీలతో మొదటి నివేదిక, 17 పేజీలతో రెండో నివేదిక ఉంది.
సమాచారం మేరకు జివోఎంకు కిరణ్ సమర్పించిన నివేదికలోని అంశాలు...
సీమాంధ్రులు హైదరాబాదు కోసం రక్తాన్ని ధారపోశారు. సిక్కోలు నుండి మచిలీపట్నం వరకు నిజాం రాజులు పాలించారు. కృష్ణా నుండి మచిలీపట్నం వరకు సామంత రాజులు నిజాం రాజులకు కప్పం చెల్లించారు. సామంతరాజులు నిజాంకు చెల్లించిన పన్నులతో హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు.
అక్షరాస్యతలో వెనుకబడి ఉన్న హైదరాబాదుకు సీమాంధ్రుల అంతర్జాతీయ ఖ్యాతని తీసుకు వెచ్చారు. గ్లోబల్ హబ్గా హైదరాబాదును మార్చారు. 1956కు ముందు పారిశ్రామిక అభివృద్ధి హైదరాబాదులో లేదు. కేవలం గోల్కొండ, చార్మినార్, సిగరేట్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉన్నాయి.
హైదరాబాదు నుండి సీమాంధ్రను విడదీయడం తల నుండి మొండాన్ని వేరు చేయడమే అవుతుంది. చార్మినార్ నాలుగు ద్వారాల్లో ఒకదాని పేరు మచిలీ కమాన్. ఆ ద్వారం మచిలీపట్నానికి దారి తీసిందనే ఆ పేరు. నిజాం కాలం నుండి సీమాంధ్ర నుండి ఉప్పు, చేపలు వచ్చాయి.
విభజన వల్ల నక్సలిజం పెరుగుతుంది. నక్సలిజంపై పలు సందర్భాలలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను కిరణ్ అందులో పొందుపర్చారు. నివేదికలో ప్రాంతాల వారీగా మావోయిస్టుల వివరాలను జివోఎంకు సమర్పించారు. మావోయిస్టుల చేతుల్లో చనిపోయిన నేతలు, పోలీసు సిబ్బంది వివరాలు ఇచ్చారు.
నాలుగున్నర దశాబ్దాల నక్సలిజం, మావోయిస్టులపై సమగ్ర నివేదికను కిరణ్ జివోఎంకు ఇచ్చారు. విభజన కారణంగా హైదరాబాద్ సిటీ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుంది. హైదరాబాదులో ఇప్పటికే పలుమార్లు ఉగ్రవాదుల దాడులు జరిగాయి. 371 డిపైన, హైదరాబాదు పైన కిరణ్ నివేదికలో వివరంగా పేర్కొన్నారు.
విభజనతో నీటి యుద్ధాలు రావడమే కాక విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుంది. విభజన జరిగితే తెలంగాణలో రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. తెలంగాణలోనే విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుంది. రిపోర్ట్ సమర్పించిన కిరణ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని గట్టిగా చెప్పారు.