అసని తీవ్ర తుఫాను బీభత్సం: ఏపీలో అతి భారీ వర్షాలు, తీరానికి దగ్గర్లో, ఇంటర్ పరీక్షలు వాయిదా
అమరావతి: తుఫాను అసని ప్రభావం కోస్తాంధ్రపై తీవ్రంగా చూపిస్తోంది. కోస్తాంధ్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు 90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. సముద్రపు అలలు కూడా భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే తీరప్రాంతాల ప్రజలు, మత్స్యకారులకు వాతావరణశాఖ, ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రభుత్వం కూడా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించే విమానాలతోపాటు రైళ్లను కూడా ఇప్పటికే రద్దు చేశారు.

అసని తీవ్ర తుఫాను.. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్
గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తీర ప్రాంతాలు ఖాళీ చెయ్యాలని హెచ్చరిక చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్లు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 40 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నంతోపాటు తీర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.

అనుకున్నదానికంటే తీరానికి దగ్గరగా అసని తుఫాను
అసని ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతోంది. ఆంధ్రాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం ఉదయం నాటికి కాకినాడ లేదా విశాఖపట్నం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త సంజీవ్ ద్వివేది తెలిపారు.తీవ్ర తుఫానుగా మారింది అసని. అనుకున్నదాని కంటే తీరానికి దగ్గరగా తుఫాను వచ్చింది. అయితే, తీరం వెంబడే ఉత్తర దిశగా ప్రయాణించి సముద్రంలోనే ఆగిపోయే అవకాశం ఉంది. కాగా, అసని తుఫాను సంపూర్ణంగా చీరాల-బాపట్ల వైపు కదులుతోంది. ప్రకాశం జిల్లా నుంచి ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, నంద్యాలతో పాటు నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. వచ్చే 10 గంటల పాటు నిరంతరాయంగా వర్షాలు, గాలులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దిశ మార్చుకున్న అసని తుఫాను.. కోస్తా, సీమలో అతి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'అసని' దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నంవైపు దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ భావిస్తోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. కాగా, సముద్రపు అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో హంసలదీవి బీచ్ గేట్లను మెరైన్ పోలీసులు మూసివేశారు.
అసని తుఫాను ప్రభావంతో ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా
అసని తుపాను ప్రభావం ఇంటర్ పరీక్షలపై పడింది. బుధవారం జరగాల్సిన ఇంటర్ పరీక్షను వాయిదా వేశారు. తుపాను వల్ల ఇంటర్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. బుధవరాం జరగాల్సిన ఇంటర్ పరీక్షను మే 25న నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. తుఫాను విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే తీరప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఇతర సహాయక బృందాలు, కోస్ట్ గార్డ్ సైతం సిద్ధంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications