Cyclone Mandous: ఏపీకి పొంచివున్న పెను తుఫాన్ ముప్పు
విశాఖపట్నం: రాష్ట్రానికి మరో పెను తుఫాన్ ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం- తుఫాన్గా పరిణమించడానికి అనుకూల వాతావరణం నెలకొంది. మరో 24 గంటల్లో ఇది తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. దీని ప్రభావం ఏపీ, తమిళనాడులపై తీవ్రంగా ఉండబోతోంది. పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అభిప్రాయపడుతోంది. ఏపీ దక్షిణ ప్రాంతం, తమిళనాడు కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఉష్ణమండల తుఫాన్..
బంగాళాఖాతంలో ఉష్ణమండల తుఫాన్ ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం చెబుతోంది. వర్షాకాల సీజన్ ముగిసిన తరువాత ఏర్పడే సైక్లోన్లను ఉష్ణమండల తుఫాన్గా పిలుస్తారు. తాజాగా ఏర్పడబోయేది కూడా అలాంటిదే. అండమాన్కు దక్షిణ దిశగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి అల్పపీడనంగా మారుతుంది. అనంతరం 24 గంటల వ్యవధిలో తుఫాన్ను పరిణమిస్తుంది. దీనికి మాండోస్గా నామకరణం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనికి ఈ పేరు పెట్టింది.
అనుకూల వాతావరణం..
దక్షిణ అండమాన్ సముద్రం - మలక్కా జలసంధికి సమీపంలో ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. సముద్ర ఉపరితలం మీద 29 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయినందున క్రమంగా అల్పపీడనంగా మారుతుందని, పశ్చిమ దిశగా కదులుతూ బుధవారం సాయంత్రం లేదా రాత్రి నాటికి తమిళనాడు తీరంలో ఉష్ణమండల తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. దీని ప్రభావం ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలపై ఉంటుందని స్పష్టం చేశారు.
ఏడో తుఫాన్..
డిసెంబర్లో ఏర్పడబోయే ఏడవ తుఫాన్ ఇది. 2019లో అరేబియా సముద్రంలో పవన్ అనే తుఫాన్ ఏర్పడినప్పటికీ- దాని ప్రభావం భారత్పై కనిపించలేదు. ఆ తరువాత వరుసగా ప్రతి ఏడాది నవంబర్-డిసెంబర్లల్లో అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతూ వచ్చాయి. అదే క్రమంలో ఈ ఏడాది కూడా మాండోస్ తుఫాన్ ముప్పు పొంచివుందని అధికారులు పేర్కొంటోన్నారు. మాండొస్ తుఫాన్ ట్రాకింగ్ ప్రకారం- ఇది 9 లేదా 10వ తేదీల్లో తీరానికి సమీపించే అవకాశం ఉంది.
కర్ణాటక, కేరళకూ..
ఎక్కడ తీరాన్ని తాకుతుందనే విషయాన్ని అంచనా వేయడానికి మరో 36 గంటల సమయం అవసరమని అధికారులు చెబుతున్నారు. ఆ సమయంలో ఏపీ దక్షిణ ప్రాంత జిల్లాలు, తమిళనాడుల్లో ఈదురు గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. 7వ తేదీ నుంచి తుఫాన్ ప్రభావం ఉంటుందని పేర్కొంటోన్నారు. రాయలసీమ, కర్ణాటక దక్షిణ ప్రాంతం, కేరళల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు వివరించారు.