Cyclone Montha: ఏపీని భయపెడుతోన్న ఆ తుపాను ఈ పేరు ఎలా వచ్చింది..?
తెలుగు రాష్ట్రాలకు సైక్లోన్ మొంథా ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే దాని ప్రభావం ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తుండగా తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయా జిల్లాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. అక్టోబర్ 28వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్పై ఈ తుఫాను విరుచుకుపడుతుందని దీని ప్రభావం ఒడిషాపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదంతా ఇలా ఉంటే ఈ తుపానుకు "మొంథా" అనే పేరు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది.. ఎవరు ఈ పేరు పెట్టారు అనే విషయం తెలుసుకుందాం.
మొంథా సైక్లోన్కు ఆ పేరు ఎలా వచ్చింది..?
సాధారణంగా ఉత్తర హిందూ మహా సముద్రం ప్రాంతంలో ఉన్న దేశాలు తుపాను తీవ్రతను బట్టి ఆ తుపానుకు పేర్లు పెట్టడం జరుగుతుంది. మొత్తం 13 దేశాలు ఉత్తర హిందూ మహాసముద్రం పరిధిలో ఉన్నాయి. సైక్లోన్ మొంథా పేరును పెట్టే అవకాశం ఈసారి థాయ్లాండ్ దేశానికి వచ్చింది. ఐక్యరాజ్యసమితి పరిధిలో పనిచేసే ప్రపంచ వాతావరణ శాఖ సంస్థ (WMO) ప్రకారం ఒక ప్రాంతంలో ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ తుపాన్లు వచ్చే ఆస్కారం ఉంది.తుఫానులకు పేర్లు పెట్టడం ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు (RSMCs), ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరిక కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో మన దేశంలోని భారత వాతావరణ శాఖ (IMD) కూడా ఒకటి.

IMD పాత్ర, 13 సభ్య దేశాలు
IMD అనేది ప్రపంచంలోని ఆరు RSMCలలో ఒకటి. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO)/ఎస్కాప్ ప్యానెల్ కిందకు వచ్చే 13 సభ్య దేశాలకు ఉష్ణమండల తుఫాను, సముద్రంలో ఉప్పెనల గురించి హెచ్చరికలు, సలహాలు ఇవ్వడం దీని విధి.
- ఈ 13 దేశాలు: బంగ్లాదేశ్, భారతదేశం, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయ్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరియు యెమెన్.
పేర్లు పెట్టే పద్ధతి
నిబంధనలు: తుఫాను పేర్లు లింగం, రాజకీయాలు, మత విశ్వాసాలు, సంస్కృతులకు తటస్థంగా (Neutral) ఉండాలి. ఏ వర్గం మనోభావాలను దెబ్బతీయకూడదు. పేరులో గరిష్ఠంగా ఎనిమిది అక్షరాలు మాత్రమే ఉండాలి.
- ఎంపిక: పేర్లు అక్షర క్రమంలో ఏర్పాటు చేసిన సభ్య దేశాల జాబితా ప్రకారం వరుసగా, నిలువుగా ఉపయోగించబడతాయి.
- తిరిగి వాడకం ఉండదు: ఒక తుఫానుకు పేరు పెట్టిన తర్వాత, ఆ పేరును మళ్లీ ఉపయోగించరు. ఇది రొటేషన్లో ఉంటుంది.
ఇప్పటికే పెట్టిన, రాబోయే పేర్లు
ఈ సీజన్లో వచ్చిన మొదటి తుఫానుకు శ్రీలంక సూచించిన విధంగా 'శక్తి' అని పేరు పెట్టారు. ఇది అరేబియా సముద్రంలో అల్పపీడనంగా మొదలై, అక్టోబరు ప్రారంభంలో తీవ్ర తుఫానుగా మారింది. అయితే, ఇది మహారాష్ట్ర, గుజరాత్లకు దూరంగా కదిలింది.
- గతంలో ఉపయోగించిన కొన్ని పేర్లు: శక్తి (శ్రీలంక), ఫెంగల్ (సౌదీ అరేబియా), డానా (ఖతార్), అస్నా (పాకిస్తాన్), రెమల్ (ఒమన్) మొదలైనవి.
- రాబోయే తుఫాను పేర్లు: జాబితా ప్రకారం, తదుపరి తుఫానుకు యూఏఈ (UAE) సూచించిన 'సెన్యార్' అని, ఆ తర్వాత యెమెన్ సూచించిన 'దిత్వహ్', బంగ్లాదేశ్ సూచించిన 'అర్నబ్', ఇంకా భారత్ సూచించిన 'మురసు' అని పేరు పెడతారు.
పేర్లలో వచ్చిన మార్పు
1900ల మధ్యలో తుఫానులకు కేవలం స్త్రీ జాతిని సూచించే పేర్లు మాత్రమే పెట్టేవారు. ఆ తర్వాత 1900ల చివరకు దక్షిణ అర్ధగోళంలోని తుఫానులకు పురుష జాతికి సంబంధించిన పేర్లు కూడా పెట్టేవారు. కానీ ఇప్పుడు, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా పేర్లను పూర్తిగా తటస్థంగా (Neutral) ఎంచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications