ఏపీకి తుఫాను ముప్పు
ఈనెల 22వ తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 24వ తేదీకల్లా అది ఈశాన్య దిశగా పయనించి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని చెబుతున్నారు. ఈనెల 24వ తేదీ తర్వాత అది ఇంకా బలపడి తుఫానుగా మారి ఒడిసా తీరంవైపు రావడానికి అవకాశం ఉంది. తుఫాను అంశంపై ఈనెల 22వ తేదీ తర్వాత మరింత స్పష్టత రానుంది.
ద్రోణి ప్రభావంతో వర్షాలు
తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం, మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో దక్షిణ భారతదేశంలో ఈ నెల 23 వరకు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో రాబోయే ఐదురోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వానలు, ఓ మోస్తరు వానలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తాయి.

రాయలసీమ మీదగా ఏపీలోకి
పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ, యానాం తదితర ప్రాంతాల్లో రాబోయే వారం రోజులపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన బలమైన గాలులు వీస్తాయి. నైరుతి రుతుపవనాలు ఆదివానం అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. ఈనెల 31వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయి. వచ్చేనెల ఐదోతేదీన రాయలసీమ మీదగా ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications