కిరణ్ పార్టీపై దానం, విహెచ్: పోరాడలేకేనని లగడపాటి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ శుక్రవారం హైదరాబాదులో నిప్పులు చెరిగారు. పార్టీలో భోగభాగ్యాలు అనుభవించిన వారే నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.
ఎవరైనా పార్టీ పెట్టాలన్నా, జాతీయ పార్టీని ధీటుగా ఎదుర్కోవాలన్నా ఎంత ఖర్చు కావాలని, వందసార్లు ఆలోచిస్తారని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం చూస్తుంటే దాని వెనుక భాగస్వాములు ఎవరో అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. అల్లర్లు సృష్టించడం ద్వారా విభజన అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కిరణ్ కొత్త పార్టీపై విహెచ్
ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడితే ఎవరూ వెళ్లరని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. లగడపాటి లాంటి వాళ్లు ఉండే పార్టీలోకి ఎవరు వెళ్తారని ప్రశ్నించారు. ఆఖరకు కిరణ్, ఆయన తమ్ముడు మాత్రమే ఆ పార్టీలో మిగులుతారన్నారు.
17న తుది నిర్ణయం: టిజి వెంకటేష్
ఈ నెల 17వ తేదీన సీమాంధ్ర ప్రాంత నేతలం అందరం భేటీ అయి ఓ నిర్ణయం తీసుకుంటామని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. అధికారం తమ లక్ష్యం కాదని, చివరిదాకా సమైక్యాంధ్ర కోసం పోరాడుతామన్నారు. ఈ నెల 16వ తేదీన అందరం భేటీ అయి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎంపీలు కూడా హాజరవుతారని చెప్పారు.
లోకసభలో దాడిపై తెలంగాణ ఎంపీల వివరణ
లోకసభలో తాము లగడపాటి, మోదుగుల పైన దాడి చేశామని చెప్పడం అవాస్తవమన్నారు. వారి పైన క్రిమినల్ కేసులు పెట్టారని హెచ్చరించారు. బిజెపికి నీతి, నిజాయితీ ఉంటే తెలంగాణకు మద్దతివ్వాలన్నారు. బిజెపి పెద్దలు చంద్రబాబు, జగన్ మాయలో పడవద్దని హితవు పలికారు.
తప్పే కానీ, తప్పలేదు: లగడపాటి
లోక్ సభలో గురువారం జరిగిన ఘటనపై లగడపాటి రాజగోపాల్ విచారం వ్యక్తం చేశారు. అలాంటి పనులు ఎవరు చేసినా తప్పేనని కానీ, తప్పలేదన్నారు. తన సహచర ఎంపీపై దాడి జరుగుతుంటే, తాను అడ్డుకోవడానికి వెళ్లానని, అప్పుడు వందమంది ఎంపీలు తనపై దాడికి ప్రయత్నించారని వారితో పోరాడలేక, విధిలేని పరిస్థితుల్లోనే పెప్పర్ స్ప్రేను ఉపయోగించానన్నారు. ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదన్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
నలుగురు ఎంపీలు తనను పట్టుకుంటే మరికొందరు దాడి చేశారని, ఆ నేపథ్యంలోనే తాను దానిని ఉపయోగించాల్సి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ కనీసం సొంత మంత్రులతోనే మాట్లాడటం లేదని, ప్రతిపక్షాలతో మాట్లాడేందుకు మాత్రం ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ నాయకులకు దేశాన్ని నడపటం చేతకాదని, పార్టీని నడపటం చేతకాదని, అన్ని విధాలా కాంగ్రెస్ నవ్వులపాలైందన్నారు.












Click it and Unblock the Notifications