TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్ప, చాప, తాడు ఊరేగింపు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి బుధవారం డీఎఫ్వో శ్రీనివాసులు, అటవి శాఖ సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు.అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు.
ఈ నెల 4వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.
ధ్వజారోహణానికి దర్భ చాప, తాడు కీలకం
. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు.

వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు.
ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేశారు. టీటీడీ అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 225 మీటర్ల పొడవు తాడు సిద్ధం చేశారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యే వరకు టీటీడీ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సంబందిత అధికారులకు సూచించారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు చూడటానికి వచ్చే శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, నిత్యం అన్నప్రసాదాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications