కరోనా విషాదం: సోషల్ మీడియాతో వీడియో పోస్టు చేసి స్కూల్ యాజమాన్య దంపతులు ఆత్మహత్య
అమరావతి: కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. పాఠశాల స్థాపించి ఫీజులు వసూలు కాకపోవడంతో అప్పుల భారం పెరిగి, రుణదాతల ఒత్తిడి ఎక్కువవడంతో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
విషగుళికలు మింగి దంపతుల ఆత్మహత్య
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కోవెలకుంట్లకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కర్నాటి రాధాకృష్ణమూర్తి కుమారుడు సుబ్రహ్మణ్యం(33), కోడలు రోహిణి(27) గత నాలుగేళ్లుగా పట్టణంలో లైఫ్ ఎనర్జీ స్కూల్ అనే ప్రైవేట్ నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆత్మకూరు మండలం కరివెన సమీపంలో కారులో సుబ్రహ్మణ్యం, రోహిణి విష గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆత్మహత్యకు ముందు వీడియో తీసుకుని..
ఆత్మహత్యకు ముందు సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో.. 'ఈ రోజు నేనూ.. నా భార్య చనిపోతున్నాం. అందరూ క్షమించాలి. విద్యార్థులు టీసీలు ఎంఈవో ఆఫీసులో తీసుకోండి. మాకు ఫీజులు రాక, అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో అవమానం భరించలేక ఇలా చేసుకోవాల్సి వస్తోంది' అని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
రెండు కోట్ల మేర అప్పులు.. ఒత్తిడి భరించలేకే..
విషయం తెలుసుకున్న స్థానికులు వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. సుబ్రహ్మణ్యం, భార్య రోహిణి స్వగ్రామం ఆత్మకూరు. వారు ఆత్మకూరు నుంచి కోవెలకుంట్లకు వస్తూ మార్గమధ్యంలోనే విష గుళికలు మింగారు. అక్కడికి చేరుకున్న బంధువులు వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. కాగా, స్కూల్ నిర్వహణ కోసం ఈ దంపతులు సుమారు రూ. 2 కోట్ల అప్పులు చేశారని స్థానికులు చెబుతున్నారు. ఒకేసారి దంపతులు ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. కరోనా కారణంగా పాఠశాలలు తెరుచుకోని విషయం తెలిసిందే. దీంతో విద్యార్థుల నుంచి ఫీజులు రాలేదు. అప్పులకు వడ్డీ పెరిగిపోవడంతోపాటు అప్పులిచ్చినవారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ దారుణానికి పాల్పడింది స్కూల్ యాజమాన్య దంపతులు. కాగా, సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకుంటున్న క్రమంలో ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం స్థానికులను కలిచివేసింది.
ఒంట్లో బాలేదని వెళ్లిన ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి
ఇది ఇలావుండగా, ఒంట్లో బాగోలేదంటూ వెళ్లిన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట మండలం ఆవిడి గ్రామానికి చెందిన మాగాపు శ్రీనుబాబు(40) మండలంలోని చిప్పిడివారిపాలెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా 2012 నుంచి పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పి.గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో శ్రీనుబాబు వారం రోజులుగా విధుల్లో నిమగ్నమయ్యారు. శనివారం రాత్రి చివరగా ఆయన ఇక్కడ ఒక తరగతిలో భారతదేశ చిత్ర పటం వేశారు. ఆ తర్వాత తనకు ఒంట్లో బాగోలేదని సహచర ఉపాధ్యాయులు శారదాకృష్ణ, వెన్నపు విజయగౌరికి తెలిపి ఇంటికి వెళ్లారు. కాగా, శ్రీనుబాబు ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, శ్రీనుబాబు గతంలో జాతీయస్థాయిలో చిత్రలేఖనంలో అవార్డు కూడా అందుకున్నారు. శ్రీను కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, స్థానికులు కోరుతున్నారు.