దేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ డిగ్రీ స్టూడెంట్ మిస్సింగ్: మదనపల్లె ఘటన మరచిపోకముందే మరో ఘటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో మదనపల్లె ఘటన మరిచిపోకముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది . మదనపల్లెలో మూఢభక్తితో అలేఖ్య, సాయి దివ్య హత్య ఘటన మరిచిపోకముందే చిత్తూరు జిల్లాలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న యువకుడు తాను దేవుడు వద్దకు వెళుతున్నాను అంటూ లేఖ రాసి కనిపించకుండా పోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
లెటర్ రాసి పెట్టి ఇంటి నుండి కనిపించకుండా వెళ్ళిపోయిన డిగ్రీ స్టూడెంట్
గంగవరం మండలం మార్చేపల్లి గ్రామానికి చెందిన గణేష్ అనే డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ జనవరి 21 నుంచి కనిపించకుండా పోయాడు. వెళ్తూ వెళ్తూ తాను దేవుడి వద్దకు వెళుతున్నా అంటూ లేఖ రాసి పెట్టాడు. అంతేకాదు తాను తిరిగి తమ్ముడికి కొడుకుగా పుడతానని ఆ లేఖలో రాసిపెట్టి ఇంటి నుండి కనిపించకుండా వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిన కొడుకు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇంట్లో వెతగ్గా, కొడుకు రాసిన లెటర్ కనిపించింది. ఆ లెటర్ చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
తాను దేవుడి దగ్గరికి వెళ్లి పోతున్నానని , తమ్ముడికి కొడుకుగా పుడతానని లేఖ
తల్లిదండ్రులకు రాసిన లేఖలో గణేష్ తాను దేవుడి దగ్గరికి వెళ్లి పోతున్నా అని, తాను కనిపించడం లేదని ఎవరూ బాధపడవద్దని, భయపడవద్దని, తాను తిరిగి తమ్ముడికి కొడుకుగా పుడతానని రాసుకొచ్చాడు. ఈ లెటర్ చూసిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి తమ కొడుకు ఎక్కడున్నాడో వెతకమని ప్రాధేయపడ్డారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, కేసు దర్యాప్తు చేపట్టారు. గణేష్ కు భక్తి చాలా ఎక్కువ అని స్థానికులు బంధువులు చెబుతున్నారు.
మదనపల్లె ఘటన నేపధ్యంలో తాజా ఘటనపై ఆందోళన .. పోలీసుల దర్యాప్తు
మదనపల్లి లో తాజాగా జరిగిన ఘటన నేపథ్యంలో గణేష్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూఢ భక్తితో గణేష్ ఆత్మహత్యకు పాల్పడతాడేమో అన్న భయం వారిని ఆందోళనకు గురి చేస్తుంది.
కనిపించకుండా పోయిన గణేష్ తో పాటు బైక్, సెల్ ఫోన్, పుస్తకాల బ్యాగు ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొడుకు ఏం చేసుకుంటాడో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గణేష్ కోసం గాలింపు చేపట్టారు.