ప్రమాదం: ఆఫర్ లెటర్ జాప్యం టెక్కీ ప్రాణం తీసింది
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం దగ్గర మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వోల్వో బస్సులో మంటలు వ్యాపించడంతో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ బస్సులోనే ప్రయాణిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆడారు రవి(27) కూడా ప్రమాదంలో కాలిబూడిదయ్యాడు. అయితే తన ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ లెటర్ ఒక రోజు ఆలస్యమైనందువల్లే రవి తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అతని ప్రాణ స్నేహితుడు కె. లీలా శివప్రసాద్ తెలిపాడు.
అంతా సజావుగా జరిగి ఉంటే ఆడారు రవి తన కలలుగన్న బహుళజాతి సంస్థ అక్సెంచర్ హైదరాబాద్ కార్యాలయంలో చేరి ఉండేవాడని శివప్రసాద్ చెప్పాడు. రాత్రి బస్సులో ఎక్కేటప్పుడు తాను ఫోన్ చేస్తే.. జాబ్లో చేరిన సాయంత్రం కెఎఫ్సిలో పార్టీ కూడా చేసుకుందామని రవి చెప్పినట్లు తెలిపాడు. రవిని ఇప్పుడు గుర్తు పట్టేందుకు వీలులేదని శివప్రసాద్ కన్నీళ్ల పర్యాంతమయ్యాడు.
ఒక్క రోజు వేచి చూసినట్లయితే బెంగళూరులోని మరో బహుళజాతి కంపెనీ కెటి అండ్ కెలో ఉద్యోగం పొందేవాడని ఆయన తెలిపాడు. ఒక విధంగా తన మరణానికి తానే బాధ్యుడినని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం విషయంలో రవి ఎటూ తేల్చుకోకపోతుంటే.. కెటి అండ్ టి కంటే హైదరాబాద్లోని అక్సెంచర్ పెద్ద కంపెనీ అని సలహా ఇచ్చినట్లు తెలిపాడు. కెటి అండ్ టి కంపెనీ నుంచి మంగళవారం నాటికి ఆఫర్ లెటర్ వస్తే ఉండిపోతానని, లేదంటే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చేస్తానని రవి చెప్పినట్లు శివప్రసాద్ చెప్పాడు.
తనను కలుసుకోవాలన్న ఆత్రుతలో ఉన్న తాను, గుర్తుపట్టడం కూడా కష్టమైన స్థితిలో ఉన్న మిత్రుడి శవాన్ని చూడడానికి ఘటనా స్థలానికి వచ్చినట్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు. విజయనగరానికి చెందిన రవి చదువులో ఎంతో చురుకుగా ఉండేవాడని శివప్రసాద్ తెలిపాడు. మాచర్లలోని న్యూటన్ కాలేజీలో 2007లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కొంత కాలం నుంచి బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వహించినట్లు చెప్పాడు. రవి తల్లిదండ్రులు, ఓ చెల్లి, అన్నయ్య విజయనగరంలో ఉంటున్నట్లు శివప్రసాద్ తెలిపాడు.