చిన్న రాజప్ప కాన్వాయ్ వాహనం బోల్తా
కడప: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప కడప జిల్లా పర్యటనలో శనివారంనాడు అపశృతి చోటు చేసుకుంది. ఆయన కాన్వాయాలోని వాహనం బోల్తా పడింది. జిల్లాలోని మైదుకూరు మండలం జీవి సత్రం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
ఇదిలావుంటే, శ్రీశైలం జలాశయం నీటి వినియోగంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై చిన్నరాజప్ప స్పందించారు. శ్రీశైలం జలాశయంలో నీటి వినియోగంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్తో చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ నిర్వాకంతో తెలంగాణలో విద్యుత్తు కష్టాలు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై దృష్టి పెట్టడంతో సమస్యను అధిగమించామని ఆయన చెప్పారు.
కెసిఆర్ శ్రీశైలం నీటిపై రాజకీయం చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదని ఆయన అన్నారు. ఎర్రచందనం సంరక్షణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని చిన్న రాజప్ప చెప్పారు. మంత్రి వెంట తెలుగుదేశం పార్టీ నేతలు లింగారెడ్డి, వరదరాజులు రెడ్డి, రామసుబ్బారెడ్డి, సుధాకర్ యాదవ్ తదితరులు ఉన్నారు.
కాగా, శ్రీశైలం జలాశయంలో విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, గంటా శ్రీనివాస రావు, ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణ మూర్తి కూడా స్పందించారు.












Click it and Unblock the Notifications