సిఎంనవుతానని 3 వేల ఎకరాలు కొనిపించారు: జగన్ను ఏకేసిన ఉమ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రాబోనని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ధ్వజమెత్తారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి జగన్ తన మిత్రులతో 3 వేల ఎకరాల భూమి కొనుగోలు చేయించారని ఆయన గురువారం ఆరోపించారు. అమరావతి శంకుస్థాపనకు రానని చెప్పిన వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడని ఆయన అన్నారు. ప్రధాని, విదేశీ ప్రతినిధులు వస్టుంటే తాను రానని జగన్ చెప్పి చరిత్ర హీనుడుగా మిగిలిపోయారని ఆయన అన్నారు.
శుభం పలుకరా అంటే వెనుకటికొకడు ఎప్పుడూ అశుభం పలికేవాడని ఆ కోవకే జగన్ చెందుతారని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. జగన్ను ప్రజలు ఛీకొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయని అన్నారు. జగన్ వ్యాఖ్యలు విన్న ఏపీ ప్రజలు జగన్ ను అసహ్యించుకుంటున్నారని తెలిపారు. జంతర్ మంతర్ కేడీలకు జగన్ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రం విడిపోయినా తాము అమరావతి శంకుస్థాపనకు వస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులు చెబుతుంటే ప్రతిపక్ష నేతగా ఉండి తాను రానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్ర చౌదరి అన్నారు.

ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ ద్వారా వైయస్ రాజశేఖర రెడ్డి 2 లక్షల ఎకరాలు ప్రజల నుంచి లాక్కున్నారని ఆయన ఆరోపించారు. బ్రాహ్మణి, లేపాక్షి భూములను బ్యాంకుల్లో పెట్టి లక్షలు దండుకున్నారని నరేంద్ర చౌదరి ఆరోపించారు.
మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు కూడా జగన్పై విరుచుకుపడ్డారు. తనను అమరావతి శంకస్థాపనకు ఆహ్వానించవద్దని, తాను రాబోనని చెబుతూ జగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాసిన మరుక్షణం నుంచి ఆయనపై టిడిపి నాయకులు విరుచుకుపడుతున్నారు.












Click it and Unblock the Notifications