పోలవరం పూర్తయితే వైసీపీకి పుట్టగతులుండవ్: జగన్కు బల్ల గుద్ది చెప్పిన దేవినేని
పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలకు మంత్రి దేవినేని ధీటుగా బదులిచ్చారు.
విజయవాడ: ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం చట్టబద్దత కల్పించడంతో కేంద్ర కేబినెట్ కు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ప్యాకేజీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ ప్రతిపక్ష విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
మరోవైపు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ప్రతిపక్ష అధినేత జగన్ ప్రాజెక్టుల అంశాన్ని లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలన్ని తప్పుల తడకలుగా ఉన్నాయని ఆరోపించారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందే దివంగత సీఎం వైఎస్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భారీగా నిధులుగా కేటాయించారని జగన్ గుర్తుచేశారు.

గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు ఒక్క పైసా కేటాయించలేదని అన్నారు. పోలవరంపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని ఇచ్చిన హామిని ఆయన మరిచిపోయారని జగన్ మండిపడ్డారు.
పూర్తి చేసి తీరుతాం:
పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలకు మంత్రి దేవినేని ధీటుగా బదులిచ్చారు. జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలు ఉత్తరకుమారుడిలా ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టు పనులు రాజశేఖర్ రెడ్డి, జగన్ వల్లే ఆలస్యం అయ్యాయని దేవినేని ఆరోపించారు.
ఇదే సందర్బంగా గతంలో సీఎం చంద్రబాబు దివంగత సీఎం వైఎస్ చేసిన సవాల్ ను గుర్తుచేశారు. పోలవరంను ఐదేళ్లలో పూర్తి చేయగలిగితే సభలోనే వైఎస్ కు సన్మానం చేస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనను గుర్తుచేశారు.
ఆ తర్వాతి కాలంలో వెయ్యి కోట్ల రూపాయలు, పవర్ ప్రాజెక్టు కొట్టివేయాలన్న ఉద్దేశంతో వైఎస్ పనులు ప్రారంభించారని విమర్శించారు. అదే సమయంలో 2019వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని బల్ల గుద్ది మరీ దేవినేని స్పష్టం చేశారు. చేసి చూపిస్తా అని పలుమార్లు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం పూర్తిచేస్తే వైసీపీకి పుట్టగతులుండవు అని విమర్శించారు.












Click it and Unblock the Notifications