మంత్రి పెద్దిరెడ్డి హౌస్ అరెస్టుకు ఎస్ఈసీ ఆదేశాలు... డీజీపీ గౌతమ్ సవాంగ్ రియాక్షన్ ఇదే....
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి,ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు మధ్య అనునిత్యం పెద్ద యుద్దమే నడుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం మొదలు దూకుడుగా ముందుకెళ్తున్న నిమ్మగడ్డ... ఈ క్రమంలో అధికార వైసీపీకి చెందిన నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు లేఖ రాసి సంచలనం రేపిన ఎస్ఈసీ... తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్టు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసి మరో సంచలనానికి తెరలేపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు.
మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి ఇప్పటివరకూ తనకెలాంటి ఆదేశాలు అందలేదన్నారు. ఎస్ఈసీ ఆదేశాలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. తాను రాజకీయ విషయాలు మాట్లాడనని, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోనని డీజీపీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ ఆదేశాలు అందిన తర్వాత డీజీపీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కేంద్రంగా ప్రభుత్వానికి,ఎస్ఈసీకి మధ్య ఈ పోరు నడుస్తోంది. చిత్తూరు,గుంటూరు జిల్లాల్లో భారీగా నమోదైన ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించిన సంగతి తెలిసిందే. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను ప్రకటించకూడదని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. నిమ్మగడ్డ చేసిన ఈ ప్రకటనపై మంత్రి పెద్దిరెడ్డి భగ్గుమన్నారు. 'ఆయన ఏం చేసుకున్నా మార్చి 31 వరకే. ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోవద్దు. ఆయన ఇచ్చే ఆదేశాల్ని పాటించాల్సిన అవసరం లేదు. అలా కాదని, ఎవరైనా ఆయన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటే.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే, మేం అధికారంలో వున్నన్నాళ్ళూ ఆయా అధికారులను బ్లాక్ లిస్టులో పెట్టేస్తాం.' అని హెచ్చరించారు.
పెద్దిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ... ఈ నెల 21వ తేదీ వరకు ఆయన్ను ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్సవాంగ్కు ఆదేశాలు జారీ చేశారు. పెద్దిరెడ్డికి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ ఎస్ఈసీ ఆదేశాలు ఇంకా అందలేదని పేర్కొనడం గమనార్హం. మరోవైపు అటు ఎస్ఈసీకి,ఇటు ప్రభుత్వానికి నడుమ అధికారుల పరిస్థితి గందరగోళంగా మారింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా వారి పరిస్థితి తయారైంది.