ధర్మాన సంచలనం : కులాలు చూసి ఓట్లు పడవు-పెరిగిన అవినీతి : సిగ్గుపడాల్సిన పరిస్థితి..!!
ఏపీ కేబినెట్ లో రెవిన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ధర్మాన ప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలి సారి జిల్లాకు వచ్చిన ధర్మానకు పార్టీ శ్రేణులు అభినందన సభ ఏర్పాటు చేసారు. రెవిన్యూ శాఖలో అవినీతి భారీ స్థాయిలో పెరిగిపోయిందని..దాని నివారణకు కృషి చేస్తానని చెప్పారు. అవినీతికి ఆస్కారం ఇవ్వకూడదనే సీఎం జగన్ బ్యాంకుల నుంచి రైతుల ఖాతాలకు నేరుగా నగదు పంపే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారని చెప్పారు. అయినా..అవినీతి తగ్గలేదని..ఇది మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి అంటూ వ్యాఖ్యానించారు.
నిజాయితీగా పని చేస్తేనే ప్రజలు నమ్ముతారని ధర్మాన వ్యాఖ్యానించారు. కులం..మతం చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయని చెప్పుకొచ్చారు. తాజాగా, పంజాబ్ లో జరిగిన ఎన్నికల్లో ఆప్ కు పట్టం కట్టటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. వయోభారం కారణంగా తనకు రాజకీయాల్లో ఉత్సాహం తగ్గుతోందన్నారు. త్వరలో విరామాన్ని ప్రకటించి..కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అనిసిస్తోందని చెప్పారు. అయితే, ప్రజల నుంచి అందుతున్న ప్రేమాభిమానాలు అందుకు అడ్డు వస్తున్నాయని ధర్మాన చెప్పుకొచ్చారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలుత రెవిన్యూ శాఖను పిల్లి సుభాష్ చంద్రబోసుకు అప్పగించారు. ఆయన రాజ్యసభకు ఎంపిక అయిన తరువాత డిప్యూటీ సీఎం హోదాలో ఆ శాఖను ధర్మాన ప్రసాద రావు సోదరుడు ధర్మాన క్రిష్ణదాసుకు కేటాయించారు. ఇక, ఇప్పుడు అదే శాఖను ధర్మాన ప్రసాదరావు పర్యవేక్షిస్తున్నారు. అయితే.. రెవిన్యూ శాఖలో అవినీతి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అందునా.. గతంలో వైఎస్ - రోశయ్య-కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనూ రెవిన్యూ శాఖ పర్యవేక్షించిన ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయటం పైన చర్చ మొదలైంది.