చంద్రబాబు క్రిమినల్ మాఫియా 1990 చిప్.. జగన్ పరివార్ వైరస్ చిప్.. కొల్లు అరెస్టుపై డైలాగ్ వార్..
వైసీపీ కీలక నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యోదంతంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. అవతలివాళ్ల నేరచరిత్రను గుర్తు చేస్తూ రెండు పార్టీల నేతలూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలకు సైతం నేతలు వెనుకాడటంలేదు.

చీమకు కూడా హాని చేయని..
వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుపట్టారు. వైసీపీ సర్కారు తీరును ప్రశ్నిస్తున్నందుకే కొల్లు రవీంద్రపై కక్ష కట్టారని, ఆయన కలెక్టరేట్ లో ఉండగా, సెల్ ఫోన్ ద్వారా హత్యకు ఆదేశాలిచ్చినట్లు కాల్ డ్రామా ఆడుతున్నారని ఫైరయ్యారు. ‘‘కొల్లు రవీంద్రది చీమకు కూడా హాని తలపెట్టని సున్నితమైన వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిని హత్య కేసులో ఇరికించడం దారుణం''అని పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మీది 1990 చిప్..
మోకా భాస్కర్ రావు హత్యతో కొల్లు రవీంద్రకు సబంధం లేదని, ఆ సమయంలో ఆయన కలెక్టరేట్ లో ఉన్నారంటూ చంద్రబాబు చెప్పడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తప్పుపట్టారు. ఒకప్పుడైతే ఏమోగానీ, ఇప్పుడు నేరస్తులెవరూ తప్పించుకోలేరని అన్నారు. ‘‘చంద్రబాబులాగే ఆయన క్రిమినల్ మాఫియా 1990ల నాటి చిప్ లనే వాడుతున్నారు. భాస్కర్ రావు హత్యకు స్కెచ్ వేసి.. కలెక్టరేట్ కు వెళ్లాడట కొల్లు రవీంద్ర. సెల్ ఫోన్లు, సిసి కెమెరాలు లేనప్పుడు ఈ ఎలిబీలు, సాక్షాలు పనికొచ్చేవేమో. ఇప్పుడు మాత్రం నేరం చేసినా, సుపారి ఇచ్చినా తప్పించుకోలేరు'' అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఆ గల్లీ నేత ఎవరు?
కొల్లు రవీంద్ర అరెస్టు వ్యవహారంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వైసీపీ ఎంపీ.. విశాఖకు చెందిన ఓ నాయకుడిపైనా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘విశాఖపట్నంలో ఓ పబ్లిక్ పార్కును కబ్జా చేసిన గల్లీ నాయకుడొకరు.. ఎన్నికలకు ముందు జగన్ అసలు అధికారంలోకే రారని అన్నాడు. ఇప్పుడు కూడా పచ్చ మీడియా డిబేట్లలో ఊదరగొడుతూ, జగన్ పూర్తికాలం అధికారంలో ఉండరని అంటున్నాడు. చంద్రబాబు తొత్తులైన ఇలాంటి వాళ్లకు రీచార్జ్ చేయడం ఆపేస్తే నోళ్లు మూగబోతాయి..''అని సాయిరెడ్డి మండిపడ్డారు. ప్రతినిత్యం టీవీ డిబేట్లలో పాల్గొంటూ సీఎం జగన్ పై అదే పనిగా విమర్శలు చేసే ఆ విశాఖ నేత సబ్బం హరి అయి ఉండొచ్చని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే..
Recommended Video

వైసీపీ చిప్కు వైరస్..
చంద్రబాబు క్రిమినల్ మాఫియా 1990ల నాటి చిప్ వాడుతోందంటూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా బదులిచ్చారు. సీఎం జగన్ బాబాబు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ కౌంటర్ విసిరారు. ‘‘సీఎం జగన్ తోపాటు ఆయన క్రిమినల్ పరివార్ కూడా మోకాళ్లలో ఉన్న చిప్ వాడుతున్నారు.. దానికిప్పుడు వైరస్ కూడా సోకింది. బాత్రూంలో బాబాయ్ గుండెపోటుతో పోయారని కలరింగ్ ఇచ్చారు. విషయం బయటపడేసరికి సీబీఐ అని అరిచారు. అధికారం వచ్చి 13 నెలలు అవుతున్నా బాబాయ్ ఆత్మ శాంతించలేదు. రక్తం తుడిచేసినా, గుండెపోటు అని తలపట్టుకున్నా నేరస్తులని బాబాయ్ వదిలిపెట్టడు. ఇదే వాస్తవం'' అని బుద్దా వెంకన్న రాసుకొచ్చారు.












Click it and Unblock the Notifications