ఏపీలో కరోనా ప్రభావంపై జగన్, నిమ్మగడ్డను తప్పుదోవ పట్టించారా ? స్ధానిక పోరు వివాదం వెనుక..
ఏపీలో కరోనా వైరస్ కారణంగా స్ధానిక ఎన్నికలు వాయిదా పడటంపై వైసీపీ సర్కారు ఆగ్రహంగా ఉంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసినా ఫలితం లేకపోయింది. అయితే పరిస్ధితి ఇంత వరకూ రావడానికి ప్రభుత్వంలోని కొందరు అధికారులు, సలహాదారుల వైఖరే కారణమనేది తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కరోనా తీవ్రతను ప్రభుత్వాధినేతగా ఉన్న సీఎం జగన్ తో పాటు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడంలో బాధ్యత కలిగిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు దీన్ని బట్టి అర్ధమవుతోంది.

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం..
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. మన దేశంలోనూ వైరస్ ప్రభావం కనిపిస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా పరిస్దితి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతోంది. కానీ ఏపీలో మాత్రం పరిస్ధితి వేరేలా ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా వైరస్ ప్రభావం కాస్త తక్కువగానే ఉంది. అసలు లేదని చెప్పలేం కానీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పరిస్ధితి మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో స్ధానిక ఎన్నికలు వాయిదా పడటంతో ఇప్పుడు అందరి దృష్టీ కరోనాపైనే కేంద్రీకృతమైంది.

కరోనా ప్రభావం- ప్రభుత్వం,ఈసీ దృష్టికి..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మొదలు కాగానే వైద్యారోగ్యశాఖ అధికారులు బాగానే అప్రమత్తమయ్యారు. కానీ దీన్ని మరీ సీరియస్ గా తీసుకోలేదు. అప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చినందున ఎన్నికల సంఘానికి కానీ, ఇటు సీఎం జగన్ కి కానీ కరోనా ప్రభావంపై పూర్తి వివరాలు అందించలేదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి సరైన సమాచారం కోరినా రాకపోవడంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకోవడం మొదలుపెట్టారు. అయినా ఇక్కడి అధికారులు మేల్కొనలేదు. ఎంతసేపూ కరోనా లేదంటూ ప్రకటనలు చేస్తూ కాలం గడిపేశారు. సీఎం జగన్ కు కూడా కరోనా తీవ్రత గురించి చెప్పలేదు.

ఈసీకి వివరాలు ఇవ్వకపోవడంతో ...
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి కరోనా ప్రభావంపై ఎలాంటి సమాచారం లేకపోవడం, కేంద్ర సంస్ధల నుంచి అందుతున్న సమాచారంతో పరిస్ధితి తీవ్రతను గమనించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసేసుకున్నారు. నిమ్మగడ్డ వాయిదా నిర్ణయం ముందుగా తెలిసినా అధికారులు సీఎం జగన్ దృష్టికి ఆ విషయం తీసుకెళ్లలేదు. దీంతో చివరి నిమిషం వరకూ ఎన్నికలపై చర్చలతో బిజీగా ఉన్న జగన్ కు ఒక్కసారిగా నిమ్మగడ్డ నిర్ణయం షాక్ గా పరిణమించింది. దీంతో ఆయన ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే గవర్నర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని సైతం కులం కోణంలో మరీ చీల్చిచెండాడేశారు.
Recommended Video

అదే ఈసీకి సమాచారం ఇచ్చి ఉంటే...
ఏపీలో కరోనా ఎఫెక్ట్ పై రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డతో పాటు సీఎం జగన్ కు పూర్తిస్ధాయిలో సమాచారం అంది ఉంటే ప్రభుత్వానికి సైతం ఎన్నికల వాయిదాపై సమాచారం ఉండేదని ఇప్పుడు ఏపీలో అధికార వర్గాలు తీరిగ్గా చర్చించుకుంటున్నాయి. ఈసీకి కరోనాపై స్పష్టమైన సమాచారం అంది ఉంటే దాని తీవ్రతను సరిగ్గా అంచనా వేసి ఎన్నికల వాయిదా అంత తీవ్ర నిర్ణయం తీసుకునే వారు కాదని, అలాగే సీఎం జగన్ కు సైతం పూర్తి సమాచారం ఉండి ఉంటే ఎన్నికల వాయిదా కంటే ముందే నష్టనివారణ చర్యలకు ఉపక్రమించే వారని చెప్తున్నారు. అంటే చిన్న సమాచార లోపం ఇప్పుడు ఏపీలో రెండు రాజ్యాంగ వ్యవస్ధల మధ్య పోరుగా పరిణమించడానికి అధికారులు కారణమైనట్లు అర్దమవుతోంది.












Click it and Unblock the Notifications