దేవినేనిVsనాని: బెజవాడ టిడిపిలో 'బిజినెస్మెన్' గోల
విజయవాడ: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఆ పార్టీలో చేరికల కలకలం కూడా కనిపిస్తోంది. జిల్లా పరిశీలకులు సుజనా చౌదరి ఆదివారం విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించిన సమావేశం వాడి వేడిగా సాగింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్బై చెప్పి వ్యాపారవేత్త పొట్లూరి వర ప్రసాద్ టిడిపి వైపు చూస్తున్నారు. ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వర రావు సహకరిస్తున్నారని పార్టీ నేత కేశినేని నాని.. సుజనా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన దేవినేని.. తనపై నాని లేనిపోని ఆరోపణలను చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సుజనా సీరియస్గా స్పందించినట్టు తెలుస్తోంది. ఎవరూ అనవసర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారట. కాగా, మంత్రి పార్థసారథి టిడిపిలోకి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానిక తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
పార్థసారథిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తామని, ఆయన పార్టీలోకి వస్తే ఆత్మహత్యా సదృశమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారట. ఈ విషయాన్ని పలువురు నేతలు సుజనా చౌదరి దృష్టికి తీసుకు వచ్చారని తెలుస్తోంది. మరోవైపు వెంకటేశ్వర రావు టిడిపిలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన నూజివీడు సీటు కోరుతున్నట్టు ప్రచారం కూడా జరుగుతోంది.
ఇక పొత్తుల పేరుతో విజయవాడలో ఇతర పార్టీలకు అవకాశాలు ఇవ్వద్దని, బిజెపికి కూడా చాన్స్ ఇవ్వరాదని తెలుగు తమ్ముళ్లు గట్టిగా వాదిస్తున్నారు. మూడు స్థానాల్లోనే టిడిపినే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. బిజెపి తరపున సాయి కుమార్ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో వారు ప్రస్తావించారని తెలుస్తోంది.