BRSలో చేరే ఎమ్మెల్యేలు YCPవారా? TDPవారా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి.భారత రాష్ట్ర సమితి తన కార్యకలాపాలను ప్రారంభించడంతో చర్చలు జోరందుకున్నాయి. ఏపీకి సంబంధించిన నేతలను పార్టీలోకి చేర్చుకోవడంతోపాటు బాధ్యతలు కూడా కట్టబెట్టింది. తోట చంద్రశేఖర్ ను ఏపీ అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు. వీరి చేరికల సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మహామహులంతా రాబోతున్నారు..
ఏపీలోని ఎమ్మెల్యేలతోపాటు మహామహులైన నేతలంతా బీఆర్ ఎస్ లో చేరబోతున్నరాని చెప్పారు. ప్రస్తుతానికి ఏపీలో వైసీపీకి, టీడీపీకి ఎమ్మెల్యేలున్నారు. జనసేన తరఫున ఉన్న ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన కరణం బలరాం (చీరాల), వల్లభనేని వంశీ (గన్నవరం), మద్దాలి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేష్ కుమార్ (విశాఖ దక్షిణం) కూడా వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 23 స్థానాల్లో విజయం సాధించింది. వారిలో నలుగురు వైసీపీకి అనుబంధమవడంతో మిగిలినవారు 19 మంది ఎమ్మెల్యేలు. అలాగే వైసీపీ 151 సీట్లను కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి కాకుండా 150 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

అక్కడక్కడా అసంతృప్త స్వరాలు
వైసీపీ పటిష్టంగా కనపడుతోంది. అక్కడక్కడా అసంతృప్త స్వరాలు వినపడుతున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు తమ నిరసన వినిపిస్తున్నారు. వీరిలో ఆనం పార్టీ మారతారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలం తర్వాత నుంచే ఆనం విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ అక్కడ ఇన్ఛార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. దీంతో రానున్న ఎన్నికల్లో రామనారాయణరెడ్డికి సీటు కష్టమనే వార్తలు వస్తున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తాడేపల్లికి పిలిపించి మాట్లాడటంతో ఆయన మెత్తబడ్డారు. అధిష్టానంతో విభేదాలకన్నా స్థానిక నాయకులతోనే ఆయనకు ఎక్కువ విభేదాలున్నాయి.

మైండ్ గేమ్ కోసం విసిరిన పాచిక?
తెలుగుదేశం పార్టీ తరఫున మిగిలిన 19 మందిలో చంద్రబాబు మినహా మిగతా 18 మంది ఎమ్మెల్యే తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వీరంతా అధినేత మాటను జవదాటడంలేదు. రానున్న ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకొని అధికారం రావాలనే లక్ష్యంతో ఆ పార్టీ పనిచేస్తోంది. ఈ రెండు పార్టీల్లోను ప్రస్తుతం ఇటువంటి వాతావరణం నెలకొంది. ఏపీలో ప్రజలంతా కేసీఆర్ విముఖత ప్రదర్శిస్తారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా తమను తట్టిన తిట్లు, ఈసడింపులు, అవమానాలను ఎవరూ మరిచిపోలేదు. మరి కేసీఆర్ ప్రకటించినట్లుగా ఏపీ నుంచి ఎమ్మెల్యేలు వస్తారనేది కేవలం మైండ్ గేమ్ కోసం విసిరిన పాచికగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications